బీహార్లోని జముయి జిల్లాలో రూ.500 కోసం ఇద్దరు హెల్త్ వర్కర్లు బాహాబాహీకి దిగారు. జట్టు పట్టుకుని నానా రచ్చ సృష్టించారు. ఆస్పత్రిలోనే పరస్పర దాడికి దిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ సంఘటన ఆదివారం జాముయిలోని లక్ష్మీపూర్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జరిగింది. ఇంతకీ అసలేం జరిగిందంటే?.. నవజాత శిశువుకు బీసీజీ టీకా కోసం ఆశా కార్యకర్త రింటు కుమారి పీహెచ్సీకి తీసుకొచ్చింది. అయితే టీకా వేయడానికి ఏఎన్ఎం రంజన కుమారి రూ.500 ఇవ్వాలని డిమాండ్ చేసింది. దాంతో ఆశా కార్యకర్త ఆమెతో వాగ్వాదానికి దిగారు. అది కాస్తా చినికి చినికి గాలివానలా మారింది. ఒకరిపై మరొకరు చెప్పులు విసురుకోవడం వరకు వెళ్లింది. ఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.