బెంగళూరు: చీటింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తమిళనాడు మాజీ మంత్రి, టీటీవీ దినకరన్ గ్రూప్ లోని ఎమ్మెల్యే సెంథిల్ బాలాజీ చెన్నై పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో కొడుగు సమీపంలోని రిసార్ట్ నుంచి చాకచక్యంగా తప్పించుకుని పారిపోయాడు.జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సెంథిల్ బాలాజీ రవాణా శాఖ మంత్రిగా పని చేశారు. ఆ సమయంలో రవాణా శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానని ఓ వ్యక్తి దగ్గర రూ. 4.25 లక్షలు తీసుకున్నాడు. ఎంత కాలానికి ఉద్యోగం రాకపోవడంతో బాధితుడు సెంథిల్ బాలాజీని నిలదీశాడు.
నేను మంత్రి, ఏం చేస్తావు ?
మంత్రి హోదాలో ఉన్న తనను నువ్వు ఏమీ చెయ్యలేవని సెంథిల్ బాలాజీ బెదిరించడంతో బాధితుడు చెన్నై క్రైం బ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తరువాత చాల మంది బాధితులు ఉద్యోగం ఇప్పిస్తామని మా దగ్గర సెంథిల్ బాలాజీ డబ్బు తీసుకున్నాడని పోలీసులను ఆశ్రయించారు.
రూ. 1.20 కోట్లు స్వాహా
ఉద్యోగం ఇప్పిస్తానని సెంథిల్ బాలాజీ మొత్తం రూ. 1.20 కోట్లు తీసుకుని మోసం చేశాడని పోలీసులు కేసు నమోదు చేశారు. విషయం తెలుసుకున్న జయలలిత అప్పట్లో సెంథిల్ బాలాజీని మంత్రి పదవి నుంచి తప్పించారు. ప్రస్తుతం కేసులు విచారణలో ఉన్నాయి.