వాషింగ్టన్: కరీబియన్ దీవుల నుంచి మొదలై అమెరికాను గజగజలాడిస్తున్నహరికేన్ ఇర్మా తాజాగా ఫ్లోరిడా మరోవైపు తీరాన్ని తాకింది. ఆదివారం ఫ్లోరిడాలోని కీస్ వద్ద దక్షిణ తీరాన్ని తాకిన ఇర్మా నేడు పశ్చిమ తీరానికి చేరుకుంది. పశ్చిమ తీరంలోని మార్కో ద్వీపంలో ఈ హరికేను ప్రతాపాన్ని చూపిస్తోంది. గంటకు 192 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తున్నాయి. దీంతో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. ఇక్కడి నుంచి తంపా బే ఏరియావైపుకు ఇర్మా చురుగ్గా కదులుతున్నట్లు అధికారులు తెలిపారు. కరీబియన్ దీవులను వణికించిన ఇర్మా హరికేన్ ఆదివారం ఫ్లోరిడా తీరాన్ని తాకిన విషయం తెలిసిందే. తొలుత తీవ్రత తగ్గినట్లే కన్పించినా మళ్లీ బలం పుంజుకుని పెను తుపానుగా మారింది. ఇర్మా భయంతో ఇప్పటికే ఫ్లోరిడాలో దాదాపు 63 లక్షల మందిని ఖాళీ చేయాల్సిందిగా హెచ్చరించారు. ప్రస్తుతం ఈ హరికేన్ మార్కో ద్వీపం నుంచి తంపాబే ఏరియా వైపునకు చురుగ్గా కదులుతోంది. తంపాలో 30లక్షల మంది నివసిస్తున్నారు. కాగా.. ఇర్మా స్థాయి తగ్గుతున్నట్లు కన్పిస్తోందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం తీరం వద్ద 15అడుగుల ఎత్తుతో అలలు ఎగిసిపడుతున్నాయి. దీంతో నాప్లెస్, మార్కో ద్వీపాల్లోని ప్రజలు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇర్మా ధాటికి కరేబియన్ తీరంలో ఇప్పటికే 25 మంది ప్రాణాలు కోల్పోగా.. ఫ్లోరిడాలో ముగ్గురు చనిపోయినట్లు తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఫ్లోరిడా మొత్తం హరికేన్ పరిధిలో ఉందని ట్రంప్ అన్నారు. అయితే ఇర్మా పశ్చిమ దిశగా కదులుతుండటంతో చాలా వరకు ముప్పు తప్పిందనే భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. అదే తూర్పు దిశగా కదిలితే చాలా ప్రమాదం జరిగేదని.. ఇది అదృష్టమనే చెప్పాలని ట్రంప్ అన్నారు.