కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డికి సుప్రీం కోర్టులో చుక్కెదురైయ్యింది. బళ్లారికి వెళ్లి అక్కడే ఉండటానికి తనకు అవకాశం ఇవ్వాలని గాలి జనార్దన్ రెడ్డి పెట్టుకున్న పిటిషన్ ను సుప్రీం కోర్టు కొట్టి వేసింది.తన కుటుంబం బళ్లారిలో ఉందని, తనకు అక్కడే ఇల్లు ఉందని, బెయిల్ వచ్చిన తరువాత (2015) నుంచి తాను బెంగళూరులోనే నివాసం ఉంటున్నానని. న్యాయస్థానం విధించిన షరతులు ఇప్పటి వరకు తాను ఉల్లంఘించలేదని, అందువలన బళ్లారిలో నివాసం ఉండటానికి అవకాశం ఇవ్వాలని గాలి జనార్దన్ రెడ్డి సుప్రీం కోర్టుకు మనవి చేశారు.పిటిషన్ ను జస్టిస్ ఏకే. శికారి, జస్టిస్ అశోక్ భూషణ్ విచారణ చేశారు.
సీబీఐ తరపున కోర్టుకు హాజరైన అడిషనల్ సోలిసిటర్ జనరల్ మణిందర్ సింగ్ గాలి జనార్దన్ రెడ్డి బళ్లారిలో నివాసం ఉండటానికి వీలు కాదని సుప్రీం కోర్టులో చెప్పారు.బళ్లారి, ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లాలో అడుగు పెట్టకూడదని, న్యాయస్థానం అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లకూడదనే షరతులతో అఫెక్స్ కోర్టు గాలి జనార్దన్ రెడ్డికి 2015లో బెయిల్ మంజూరు చేసిందని గుర్తు చేశారు. బెయిల్ షరతులు సడలించడానికి వీలుకాదని మణిందర్ సింగ్ కోర్టులో మనవి చేశారు. ఇరు వర్గాల వాదనలు విన్న సుప్రీంకోర్టు ద్విసభ్య బెంచ్ గాలి జనార్దన్ రెడ్డి బళ్లారి వెళ్లడానికి, అక్కడ నివాసం ఉండటానికి నిరాకరించి పిటిషన్ కొట్టివేసింది.