ఏపీ సీఎం జగన్ సోమవారం ధాన్యం, ఇతర పంటల కొనుగోళ్లపై సీఎం సమీక్ష నిర్వహించారు. రైతులందరికీ మద్దతు ధర కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. సమాచార లోపం, అలసత్వం లేకుండా రైతులతో నిరంతరం మాట్లాడాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల పాత్ర ఉండకూడదని చెప్పారు. ధాన్యం నాణ్యతా పరిశీలనలో రైతులు మోసాలకు గురికాకూడదని, ఇతర దేశాలకు ప్రభుత్వం నుంచే ఎగుమతులు చేసేలా చూడాలని అధికారులకు సూచించారు.
ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ఆర్బీకేలో ఐదుగురు సిబ్బందిని నియమించాలని సీఎం జగన్ ఆదేశించారు. గోనె సంచులు, రవాణా వాహనాలు, అవసరమైన హమాలీలను ఏర్పాటు చేయాలన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన 21 రోజుల్లో ఆ సొమ్మును రైతుల ఖాతాల్లో జమ చేయాలని చెప్పారు. పంటల కొనుగోలు సంబంధిత సమస్యలపై ఫిర్యాదులు, విజ్ఞాపనల కోసం ప్రతి ఆర్బీకేలో ఒక నంబర్ ను అందుబాటులో ఉంచాలని సీఎం జగన్ ఆదేశించారు. క్రాప్ కల్టివేటర్ రైట్స్ కార్డ్స్ పై అవగాహన కల్పించాలని, ప్రత్యామ్నాయ పంటలు సాగుచేసేలా రైతులకు అవగాహన కల్పించాలని సీఎం జగన్ ఆదేశించారు. అలాంటి వారికి ప్రత్యేక బోనస్ ఇచ్చే అంశాన్ని అధికారులు పరిశీలించాలని సీఎం జగన్ పేర్కొన్నారు.