ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వాటి పై అధికారులకు సీఎం జగన్ కీలక ఆదేశాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 20, 2021, 06:01 PM

అధికారులకు కీలక ఆదేశాలిచ్చారు. పంటల కొనుగోళ్లలో ఆర్బీకేలు క్రియాశీల పాత్ర పోషించాలని.. రైతులకు కనీసమ మద్దతు ధర దక్కేలా చూడాలని సూచించారు. రైతులందరికీ ఎంఎస్‌పీ రావడం అన్నది మన ప్రభుత్వ లక్ష్యమన్న ఆయన.. ఈ దిశగా ఆర్బీకేలు, అధికారులు కృషి చేయాలన్నారు. రైతులకు సేవలందించడంలో ఎలాంటి అలసత్వం ఉండకూడదని... ఎక్కడా కూడా సమాచార లోపం రాకూడదని చెప్పారు. రంగుమారిన, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి గతంలో ఎవ్వరూ ముందుకు వచ్చిన సందర్భాలు లేవన్నారు. రైతులకు తోడుగా నిలవడానికి చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఆ ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తున్నామని.. ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల పాత్ర ఉండకూడదని.. కొనుగోలు తర్వాతే మిల్లర్ల పాత్ర ఉండాలని స్పష్టం చేశారు. ఇతర దేశాలకు నేరుగా ప్రభుత్వంనుంచే ఎగుమతులు చేస్తే.. రైతులకు మేలు జరుగుతుందన్నారు.

ధాన్యం, పంటల కొనుగోలు కోసం ప్రతి ఆర్బీకేలో టెక్నికల్‌ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఇతర సిబ్బంది ముగ్గురు కచ్చితంగా ఉండాలని సీఎం స్పష్టం చేశారు. ప్రతి ఆర్బీకేలో కూడా కేటగిరీతో సంబంధం లేకుండా ఐదుగురు సిబ్బందిని నియమించాలన్న జగన్.. వాళ్లే రైతుల దగ్గరకు వెళ్లి రైతులతో మాట్లాడి.. కొనుగోలుకు సంబంధించి అవసరమైన ఏర్పాట్లన్నీ చేయాలని ఆదేశించారు. గన్నీ బ్యాగులు, రవాణా వాహనాలు, అవసరమైన హమాలీలను ఈ ఐదుగరు సిబ్బందే ఏర్పాటు చేయాలని జగన్ స్పష్టం చేశారు.

ధాన్యం కొనుగోలు చేసిన 21 రోజుల్లో వారికి పేమెంట్లు అందేలా తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం.. దీనిపై అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టాలని ఆదేశించారు. అన్ని కొనుగోలు కేంద్రాలు తెరిచారా? లేదా? అన్నదానిపై వచ్చే మూడు నాలుగు రోజుల్లో దృష్టిపెట్టాలని సీఎం ఆదేశించారు. కొనుగోలు ప్రక్రియ జరుగుతున్న తీరుపై అధికారులు దృష్టి పెట్టాలని.., ర్వాత క్షేత్రస్థాయి పర్యటనలు జరిపి దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్లాలని సూచించారు.
పంటల కొనుగోలు సంబంధిత సమస్యలపై ఫిర్యాదులు, విజ్ఞప్తుల కోసం ప్రతి ఆర్బీకేలో ఒక నంబర్‌ను పెట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఆ నంబర్‌కు వచ్చే ఫిర్యాదులను సీరియస్‌గా తీసుకోవాలని.. క్షేత్రస్థాయి పర్యటనలు జరిపి రైతులు చెప్పే సమస్యలను వినాలని ఆయన సూచిచారు. దీనివల్ల సమస్యల తీవ్రతతో పాటు పరిష్కార మార్గాలు లభిస్తాయన్న సీఎం.., రైతులతో ఇంటరాక్షన్, నిరంతర చర్చలు అధికారులు జరపాలని సీఎం ఆదేశించారు. జిల్లాల్లో ఉన్న జేసీలనుంచి కూడా పంటలకొనుగోలుపై నిరంతర ఫీడ్‌ బ్యాక్‌ తీసుకోవాలన్నారు.

సీసీఆర్సీ కార్డ్స్‌ ( క్రాప్‌ కల్టివేటర్‌ రైట్స్‌ కార్డ్స్‌)లపై అవగాహన నిరంతరం కల్పించాలని.. వీటి వల్ల రైతుల హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లదన్న విషయాన్ని వారికి చెప్పాలని ఆదేశించారు. రోజుకు సగటున 42,237 మెట్రిక్‌టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు అధికారులు సీఎంకు వివరించారు. రానున్న రోజుల్లో మరింత ఉద్ధృతంగా కొనుగోళ్లు జరుగుతాయని తెలిపారు.
రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుచేసేలా వారిలో అవగాహన కల్పించాలని.. ఇలా పంటలు పండించే వారికి ప్రత్యేక బోనస్‌ ఇచ్చే అంశాన్ని అధికారులు పరిశీలించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రత్యామ్నాయ పంటలు పండించేలా కార్యాచరణ సిద్ధంచేయాలన్నారు. రైతులకు మంచి ఆదాయాలు కల్పన దిశగా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశానికి వ్యవసాయశాఖ మంత్రులు కురసాల కన్నబాబు, కొడాలి నాని, సీఎస్‌ సమీర్‌ శర్మ, వ్యవసాయశాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com