పశ్చిమ ప్రకాశం ఒకప్పుడు చెరకు పంటకు పుట్టినిల్లు. అలాంటిది ఇప్పుడు ఆ ప్రాంతంలో చెరకు కనుమరుగైంది. అసలు ఆ పరిస్థితి ఆ ప్రాంతంలో ఎందుకు వచ్చింది. ఆ పంట అక్కడ తుడిచి పెట్టుకోవడానికి గల కారణాలేంటి..ఆ రహస్యం మీరు తెలుసుకోవాలంటే ఈ కథనం పూర్తిగా చదవాల్సిందే..
పశ్చిమ ప్రకాశం ప్రాంతమైన గిద్దలూరు, కంభం పరిసర ప్రాంతాలలో రైతులు చెరకు పంట విపరీతంగా పండించే వాళ్ళు. కానీ కాలక్రమంలో ఆ ప్రాంతంలో చెరకు పంట కనుమరుగైపోయింది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద చెరువులలో రెండవదైన కంభం చెరువు ఉన్న ప్రాంతంలో 30 సంవత్సరాలు వెనక్కి వెళ్తే పుష్కలంగా నీరు లభించేది.
దీంతో రైతులు పుష్కలంగా నీరు ఉందని చెరకు పంట వేసే వాళ్ళు. అంతేకాదు స్థానికంగా గానుగలు పెట్టి బెల్లం కూడా తయారు చేసే వాళ్ళు. అలా కొంత మందికి ఉపాధి కూడా దొరికేది. కానీ, కాలక్రమంలో ఈ ప్రాంతంలో వర్షాలు లేక పోవడం, కరువు విలయతాండవం చేయటం వల్ల రైతులకు చెరకు పంట పండించేందుకు కష్టతరంగా మారింది.
అంతే కాకుండా సమీప ప్రాంతాలలో ఉన్న షుగర్ ఫ్యాక్టరీలు కూడా మూతపడడం చెరకు పండించే రైతులకు గిట్టుబాటు ధర లభించకపోవడం వల్ల రైతులు చెరకు పంట వేసేందుకు వెనకడుగు వేస్తున్నారు. కాలంలో కొద్దిగా వెనక్కు వెళ్తే.. ప్రతి ఒక్కరు చెరకును నోటితో తినేవారు. రానురాను ప్రజలు వివిధ పండ్ల రసాలకు అలవాటుపడి చెరుకు తినడం మర్చిపోయారు. ఇప్పుడు పట్టణాలలో చెరుకు రసం అమ్మే ప్రాంతాలు మాత్రమే దర్శనమిస్తున్నాయి.
దాంతో పాటు ఇటీవల పొలాలలో అడవి పందుల బెడద ఎక్కువైపోయింది. దానివల్ల కూడా చెరుకు పంట వేసేందుకు రైతులు ఆసక్తి చూపించడం లేదు. ప్రస్తుతం కంభం పరిసర ప్రాంతాలలో పుష్కలంగా నీరు ఉంది. దీంతో రైతులు అరటి, వరి పంటలు వేసేందుకు మాత్రమే ఆసక్తి చూపిస్తున్నారు. చెరకు పంట వేసేందుకు రైతులు ఇష్టపడటం లేదు. ఎందుకంటే గతంలో మాదిరిగా చెరకు కొని చక్కెరను ఉత్పత్తి చేస్తే ఫ్యాక్టరీలు లేకపోవటం, అలానే బెల్లాన్ని తయారు చేసే గానుగలు కూడా స్థానికంగా అందుబాటులో లేకపోవడం, వివిధ కారణాల వల్ల వీరు చెరకు పంట వేసేందుకు వెనకడుగు వెనక తప్పటం లేదు.
గతంలో ఉపాధి కోసం ఎంతోమంది ఈ బెల్లం గానుగులలో పనిచేసే వారు. ప్రస్తుతం స్థానికులు వివిధ ప్రాంతాలకు వెళ్ళిపోతూ ఉండటం కూడా వీరికి ప్రతికూల వాతావరణం ఏర్పడింది. మరి ప్రభుత్వాలు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని స్థానికంగా చెరుకు పండించే రైతులను ప్రోత్సహిస్తే తిరిగి పాత రోజులు వస్తాయని రైతులు ఆశిస్తున్నారు. మరి ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో ఏమో మరి కొన్ని రోజులు మనం వేచి చూడక తప్పదు. భవిష్యత్తులో చెరకు పంట మరింత కనుమరుగు కాకుండా ఉండాలని అందరం ఆశిద్దాం.