ఓటర్ కార్డుతో ఆధార్ కార్డు అనుసంధానికి సంబంధించిన బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. నకిలీ ఓట్ల సమస్యను పరిష్కరించేందుకు కేంద్రం ఈ చట్టాన్ని తీసుకువచ్చింది. దీనితో పాటు ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఎన్నికల సంఘానికి మరిన్ని అధికారాలు కట్టబెట్టనుంది.ఈ కొత్త చట్టం అమలులోకి వస్తే కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునే వారి నుంచి గుర్తింపు ధృవీకరణ కోసం ఆధార్ను కోరనుంది ఎన్నికల కమిషన్. దీనితో పాటు ఇప్పటికే ఓటు హక్కు ఉన్న వారి నుంచి కూడా ఆధార్ సేకరించేందుకు వీలుపడనుంది. అయితే వ్యక్తిగత గోప్యతను దృష్టిలో ఉంచుకుని వారి వివరాలు గోప్యంగా ఉంచనున్నారు. బోగస్ ఓటర్లకు చెక్ పెట్టేందుకే ఈ బిల్లు ఆమోదించామని కేంద్రం తెలిపింది.
అర్హులందరికి ఓటు హక్కు కల్పించే ఉద్దేశంతో మరో కీలక అంశం కూడా ఈ బిల్లులో చేర్చింది కేంద్రం. దీని ప్రకారం ఏడాదికి నాలుగు సార్లు ఓటు హక్కు నమోదు చేసుకునే వీలు కలగనుంది. ప్రస్తుతం ఏడాదికి ఒకసారి మాత్రమే ఈ అవకాశం లభిస్తోంది. ఈ బిల్లు చట్ట రూపం దాల్చితే 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు నమోదు కోసం ఏడాదికి నాలుగు అవకాశాలు లభించనున్నాయి. జనవరి 1, ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1 ఈ ప్రాతిపదికన అప్లై చేసుకోవచ్చు.