గుంటూరు: నవమాసాలు నిండకుండా జన్మించిన ఓ శిశువు నెల రోజులకే నీటి డ్రమ్ములో విగతజీవిగా తేలాడు. అమ్మఒడిలో నిదురిస్తున్న ఆ బిడ్డ తెల్లవారేసరికి మృతదేహంగా మారాడు. ఈ సంఘటన నాదెండ్ల మండలం సంక్రాంతిపాడులో చోటు చేసుకుంది.
పోలీసుల వివరాల ప్రకారం.. సంకురాత్రిపాడుకు చెందిన గోపీకృష్ణ, తెలంగాణకు చెందిన ఝాన్సీదేవి ఈ ఏడాది మే లో ప్రేమ వివాహం చేసుకున్నారు. గోపికృష్ణ విజయవాడలో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. వీరికి నవంబరు 1న మగబిడ్డ జన్మించాడు. నెలల తక్కువ కారణంగా బిడ్డకు ఆరోగ్య సమస్యలు తలెత్తటంతో అప్పు చేసి వైద్యం చేయించారు. భవిష్యత్తులోనూ ఆరోగ్య ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని వైద్యులు చెప్పారు.
ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి తల్లి బిడ్డను పక్కన పడుకోబెట్టుకుని నిద్రకు ఉపక్రమించింది. తెల్లవారేసరికి పక్కన బిడ్డలేక పోవటంతో వెతికారు. బయట నీటి డ్రమ్ములో బిడ్డ మృతదేహం కనిపించింది. నరసరావుపేట డీఎస్పీ విజయభాస్కరరావు, గ్రామీణ సీఐ సుబ్బారావు, ఎస్సై సతీష్ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కుటుంబ సభ్యులను విచారించారు.
ఫిర్యాదు చేసేందుకు శిశువు తల్లిదండ్రులు నిరాకరించారు. దీంతో వీఆర్వో నాగరాజు నుంచి ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేశారు. నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలలో పంచనామా నిర్వహించి కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు. శిశువు మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసును గ్రామీణ సీఐ దర్యాప్తు చేస్తున్నారు.