రైతు సమస్యలపై చర్చించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శనివారం ప్రకటన చేసింది. దానికింద పంటల వైవిధ్యీకరణ, జీరో బడ్జెట్ ఫార్మింగ్, కనీస మద్దతు ధర వంటి పలు సమస్యలపై చర్చించనున్నారు. ఈ కమిటీలో రైతు సంఘాలకు చెందిన ప్రతినిధులు కూడా భాగమవుతారని వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వెల్లడించారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేసిన తర్వాత కూడా రైతులు నిరసనలు కొనసాగించడంలో ఎలాంటి అర్థం లేదని ఆయన అన్నారు. వారంతా తమ ఆందోళనను విరమించుకొని ఇంటికి వెళ్లాలని కోరుతున్నానని మీడియాతో చెప్పారు. నిరసనల్లో భాగంగా రైతులపై పెట్టిన కేసులు రాష్ట్రాల పరిధిలో ఉన్నాయని, వాటి ఉపసంహరణపై రాష్ట్రాలదే నిర్ణయమన్నారు.