వైద్య కళాశాలల్లో ప్రవేశాలకై నిర్వహించిన నీట్(నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్) అంశంపై తమిళనాడు ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. తమిళనాడు కూడా నీట్ను ఫాలో అవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. వెంటనే కౌన్సెలింగ్ ప్రారంభించి.. సెప్టెంబర్ 4 లోగా ప్రవేశాల ప్రక్రియ పూర్తిచేయాలని ఆదేశించింది.
దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో ప్రవేశాలకై కేంద్ర ప్రభుత్వం నీట్ పరీక్షను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే దీనిపై తమిళనాడు ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. నీట్ వల్ల సీబీఎస్ఈ, జాతీయ బోర్డు స్కూళ్లలో చదివిన వారికి మాత్రమే ప్రయోజనం చేకూరుతుందని.. గ్రామీణ ప్రాంతాల్లో చదివిన విద్యార్థులు అవకాశాలను కోల్పోతున్నారని ఆరోపించింది. కనీసం ఈ ఏడాదికైనా తమ రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలకు నీట్ నుంచి మినహాయింపు కల్పించాలని కోరింది.
ఇది కాస్తా సుప్రీంకోర్టు దాకా వెళ్లింది. దీంతో విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఈ అంశంలో కేంద్రం నివేదిక ఇవ్వాలని చెప్పింది. అయితే తమిళనాడుకు మినహాయింపు కల్పిస్తే.. మిగతా రాష్ట్రాలు కూడా కోరే అవకాశం ఉందని కేంద్రం పేర్కొంది. అందుకే తమిళనాడుకు ఎలాంటి మినహాయింపు ఇవ్వడం కుదరదని స్పష్టం చేసింది. దీంతో నీట్ను ఫాలో అవ్వాల్సిందేనని సుప్రీంకోర్టు వెల్లడించింది.