చెన్నై : తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్ రావుతో టీటీవీ దినకరన్, శశికళ మద్దతుదారులు భేటీ అయ్యారు. ఇవాళ ఉదయం 19 మంది ఎమ్మెల్యేలు.. రాజ్ భవన్ లో గవర్నర్ తో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ప్రధానంగా తాజా రాజకీయ అంశాలపై చర్చించినట్లు తెలుస్తుంది. దినకరన్ నివాసం ముందు ఆయన మద్దతుదారులు భారీ స్థాయిలో వచ్చి మద్దతు తెలిపారు.తమిళనాడులో పాలక అన్నాడీఎంకే ప్రత్యర్థి వర్గాలు నిన్న ఒక్కటైన విషయం విదితమే. దీంతో ఆరునెలల రాజకీయ అనిశ్చితికి తెరపడింది. ముఖ్యమంత్రి పళనిస్వామి, మాజీ సీఎం పన్నీర్సెల్వం చేతులు కలిపారు. గతంలో ఆపద్ధర్మంగా సీఎం పదవి చేపట్టిన పన్నీర్ ఇప్పుడు విలీనం ఒప్పందంలో భాగంగా డిప్యూటీ సీఎం అవతారం ఎత్తారు. మేమంతా అమ్మ బిడ్డలం.. అన్నదమ్ములం అంటూ సీఎం పళని ఐక్యతారాగం ఆలపించారు. మరోవైపు అక్రమాస్తుల కేసుతో జైలుపాలైన శశికళను పార్టీ అధినేత్రి పదవి నుంచి తప్పించేందుకు రంగం సిద్ధమైంది.