న్యూఢిల్లీ: చైనాతో ఉద్రిక్తతంగా మారిన డోక్లామ్ సమస్య త్వరలోనే సమసిపోతుందని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఇవాళ డోక్లామ్ అంశంపై మాట్లాడారు. డోక్లామ్ సమస్యపై చైనా సరైన పద్ధతిలో వ్యవహరిస్తుందని, రెండు దేశాల మధ్య శాంతి స్థాపన కూడా జరుగుతుందని రాజ్నాథ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ వ్యవస్థలో ప్రమోషన్లు ఆలస్యం కాకుండా చూస్తామన్నారు. ఐటీబీపీ నియామకాలపై ప్రత్యేక రూల్స్ ఉన్నాయని, అయితే దీనిపై హోం కార్యదర్శితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామన్నారు. పారామిలిటరీ జవాన్లకు ఇంటి సమస్యలు ఉన్నాయని, వాళ్లకు రెసిడెన్స్ సదుపాయాలు మెరుగుపరుస్తామన్నారు.