విజయవాడ: కాపు రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. కాంగ్రెస్ హయాంలో కాపులకు రిజర్వేషన్లు తీసేశారని, కాపుల గురించి ఇప్పుడు మాట్లాడుతున్నవారు... మేనిఫెస్టోలో ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. చదువుకునే రోజుల నుంచే... సామాజిక న్యాయం గురించి ఆలోచించానని చెప్పారు. కాపుల మనోభావాలను అర్థం చేసుకున్నానని, వీలైనంత త్వరలో మంజునాథ కమిషన్ నివేదిక వస్తుందని పేర్కొన్నారు. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కావాలని కాపులు కోరుతున్నారని, బీసీలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు. త్వరలో కాపు భవనాన్ని నిర్మిస్తామని, వీలైనంత త్వరలో కాపు రిజర్వేషన్ల సమస్య పరిష్కారిస్తామన్నారు. కాపులను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఈ సందర్భంగా చంద్రబాబు భరోసా ఇచ్చారు. నోరు పారేసుకుంటే విశ్వసనీయత రాదు. నా బాధ్యత గురించి ఎవరూ చెప్పాల్సిన అవసరంలేదు. కాపు రిజర్వేషన్లపై జగన్ టీడీపీని విమర్శించడం సిగ్గుచేటు. వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలో కాపు రిజర్వేషన్లను ప్రస్తావించలేదు. వైసీపీ ప్లీనరీలోనూ కాపుల రిజర్వేషన్ల ఊసేలేదు అని చంద్రబాబు ఆరోపించారు.