ఆంధప్రదేశ్ రాష్ట్రంలో విద్యా శాఖలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు దసరా పండుగ లోపు ప్రమోషన్లు ఇచ్చేందుకు విద్యాశాఖ ఆర్సీ నంబర్ 13021 విడుదల చేసింది. విద్యాశాఖలో గతంలో టీచర్లకు నెలవారీ పదోన్నతులు అమలు చేసేవారు. కరోనా కారణంగా కొంత కాలంగా ఆ ప్రక్రియ నిలిచిపోయింది. దీనిని పునరుద్ధరించాలంటూ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, విద్యాశాఖ డైరెక్టర్లను ఉపాధ్యాయ సంఘాలు కోరుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాలను తయారు చేసి ఎస్జీటీ క్యాడర్ నుంచి స్కూల్ అసిస్టెంట్, స్కూల్ అసిస్టెంట్ తత్సమాన కేడర్ నుంచి హైస్కూల్ హెచ్ఎం వరకూ ప్రమోషన్లు అమలు చేసేందుకు సంబంధిత ఆర్జేడీ, డీఈవోలు తగిన చర్యలు తీసుకోవాలని విద్యా శాఖ తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ ప్రమోషన్ల ప్రక్రియను దసరాలోపు పూర్తి చేయాలని ఆదేశించింది.