బంగాళాఖాతంలో ఏర్పడిన 'గులాబ్' తుఫాన్ తీరంవైపు కదులుతూ ఆందోళనకు గురిచేస్తోంది. వాయువ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ కేంద్ర బంగాళాఖాతం చుట్టూ 'గులాబ్' తుఫాన్ కేంద్రీకృతమై.. పశ్చిమ దిశగా కదులుతుంది. వాయువ్య, పశ్చిమ పశ్చిమ బంగాళాఖాతంలో 140 కిమీ తూర్పు - ఆగ్నేయంలో గోపాల్పూర్ & కళింగపట్నానికి తూర్పున 190 కి.మీ దూరంలో కదలాడుతోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారులను అప్రమత్తం చేసింది. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సిబ్బందిని సైతం మోహరించిన చర్యలు చేపట్టింది. అయితే.. తుఫాన్ ఈరోజు రాత్రికి కళింగపట్నం-గోపాల్పూర్ మధ్య తుపాను తీరం దాటనుంది. తీరం దాటే సమయంలో 75-90 కి.మీ వేగంతో గాలులు వీయడంతోపాటు.. నష్టం కూడా వాటిల్లుతుందని అధికారులు అంచనావేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో మాట్లాడారు. ఈ సందర్భంగా తుఫాన్ నష్టం.. ప్రస్తుత పరిస్థితులు, తీసుకుంటున్న చర్యల గురించి ప్రధాని మోదీ.. సీఎం జగన్ను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్విట్టర్ వేదిక వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్తో మాట్లాడాను. గులాబ్ తుఫాను నేపథ్యంలో తలెత్తిన పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నాను. కేంద్రం నుంచి సాధ్యమైనంతమేరకు అన్ని సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చినట్లు ట్విట్టర్తో ప్రధాని మోదీ తెలిపారు. అందరి శ్రేయస్సు కోసం ప్రార్థిస్తున్నానంటూ మోదీ తెలిపారు.