కర్నాటకలో ఐటీ దాడులపై రాజ్యసభలో రగడ జరిగింది. మంత్రి శివకుమార్ ఇంట్లో సోదాలు నిర్వహించడం పట్ల కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఆ పార్టీ నేతలు ఆందోళనకు దిగారు. ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ఖూనీ చేస్తోందని అహ్మద్ పటేల్ అన్నారు. అటు ఈ అంశంపై కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు. బెంగుళూరుకు చెందిన లగ్జరీ రిసార్ట్లో ఎటువంటి ఐటీ దాడులు జరగలేదన్నారు. ఎమ్మెల్యేలను సోదా చేయలేదన్నారు. కేవలం కర్నాటక మంత్రి ఇంట్లో మాత్రమే సోదాలు నిర్వహించినట్లు జైట్లీ తెలిపారు. అటు రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను కేంద్రం నిర్ధాక్షిణ్యంగా వాడుకుంటున్నదని కాంగ్రెస్ ఎంపీ ఆనంద్ శర్మ ఆరోపించారు. గుజరాత్ ఎమ్మెల్యేలను తన రిసార్ట్లో పెట్టుకున్నందుకే కర్నాటక మంత్రి, అతడి సోదరుడి ఇండ్లపై దాడులు చేయిస్తున్నారని ఆనంద్ శర్మ ఆరోపించారు. బీజేపీ పార్టీ రాజ్యసభ ఎన్నికల్లో గెలిచేందుకు కొందరికి 15 కోట్లు ఇస్తున్నదని, వాళ్ల ఇండ్లపై దాడులు చేయించాలంటూ గులామ్ నబీ ఆజాద్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ చర్యను వ్యతిరేకిస్తూ విపక్షాలు సభలో ఆందోళన కొనసాగించాయి. దీంతో డిప్యూటీ చైర్మన్ సభను వాయిదా వేశారు.