ఇటీవల కరోనా బారిన పడి ఐసోలేషన్ ఉన్న భారత క్రికెటర్ రిషబ్ పంత్ తిరిగి భారత జట్టుతో చేరాడు. ఈ విషయాన్ని బీసీసీఐ ట్విట్టర్ ద్వారా తెలిపింది. ఈ నెల 8న కరోనా బారిన పడిన పంత్.. 10 రోజుల పాటు ఐసోలేషన్ లో ఉన్నాడు. ఆ తర్వాత నిర్వహించిన పరీక్షల్లో అతడికి నెగటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో తాజాగా టీమ్ బయో బబుల్ లోకి పంత్ ఎంటర్ అయ్యాడు. ఆగస్ట్ 4న ఇంగ్లండ్ తో ప్రారంభం కానున్న తొలి టెస్ట్ కోసం పంత్ అందుబాటులో ఉండనున్నాడు.
అయితే పంత్ టీమ్తో చేరినా.. మరో వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాతో పాటు అభిమన్యు ఈశ్వరన్, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ ఇంకా ఐసోలేషన్ లోనే ఉన్నారు. ప్రస్తుతం జరుగుతున్న 3 రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ లో కేఎల్ రాహుల్ కీపర్ బాధ్యతలు చేపట్టాడు. అతడు వికెట్ కీపింగ్ బాధ్యతలను విజయవంతంగా నెరవేర్చడంతో పాటు సెంచరీతో బ్యాటింగ్ లోనూ రాణించాడు.