ఏపీలో 18 ఏళ్లు దాటిన వారికి కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం జూన్ నుంచి మాత్రమే ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. మంగళగిరిలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. 18 నుంచి 44 ఏళ్ల వారంతా వ్యాక్సిన్ వేయించుకోవడానికి కొవిన్ యాప్ లో రిజిస్ట్రేషన్ చేసుకొనేందుకు మరికొంత సమయం పడుతుందని అన్నారు. వ్యాక్సిన్ పంపిణీ కోసం తాము సంబంధిత కంపెనీలతో సంప్రదింపులు చేస్తున్నామని, ఇప్పటివరకు ఒప్పందాలు జరగలేదని, అందువల్ల మే 1వ తేదీ నుంచి మాత్రం 18 ఏళ్లు దాటిన వారికి వ్యాక్సిన్ పంపిణీ జరగదని, పేర్ల నమోదు సమయాన్ని తర్వాత ప్రకటిస్తామని ఆయన స్పష్టంచేశారు. కొవిడ్ చికిత్సలో కీలకమైన రెమ్డెసివిర్ ఇంజెక్షన్లను ప్రైవేటు ఆసుపత్రులకు కూడా అందిస్తామని సింఘాల్ వెల్లడించారు. రెమ్డెసివిర్ అక్రమ విక్రయాల్లో ప్రభుత్వ ఉద్యోగుల ప్రమేయముంటే కఠిన చర్యలు ఉంటాయన్నారు.