దేశ రాజధాని ఢిల్లీలో ఆక్సిజన్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఆక్సిజన్ అందక ఢిల్లీలోని జైపూర్ గోల్డెన్ ఆసుపత్రిలో శుక్రవారం రాత్రి 20 మంది రోగులు మృత్యువాత పడ్డారు. ఈ మేరకు ఆసుపత్రి వర్గాలు శనివారం వెల్లడించాయి. ఆసుపత్రిలో సరిపడా ఆక్సిజన్ నిల్వలు లేవని.. ప్రస్తుతం మరో 200 మందికి ఆక్సిజన్ బెడ్స్ పై చికిత్స అందిస్తున్నామని ఆసుపత్రి మెడికల్ డైరెక్టర్ డా.డీకే బలూజా తెలిపారు. శుక్రవారం సాయంత్రం 5 గంటల వరకు ఆసుపత్రికి 3,600 లీటర్ల ఆక్సిజన్ చేరాల్సి ఉండగా అర్ధరాత్రి 12 గంటలకు కేవలం 1500 లీటర్ల ఆక్సిజన్ మాత్రమే ఆసుపత్రికి చేరింది. ఏడు గంటల ఆలస్యం కావడంతో రోగులు ప్రాణాలు కోల్పోయినట్లు బలూజా తెలిపారు.