హైదరాబాద్: హైదరాబాద్లో సంచలనం రేపిన డ్రగ్స్ కేసులో ఫిల్మ్ డైరక్టర్ పూరీ జగన్నాథ్ ఇవాళ సిట్ విచారణకు హాజరయ్యారు. ప్రస్తుతం నాంపల్లిలో ఉన్న ఆబ్కారీ ఆఫీసులో సిట్ బృందం పూరీని విచారిస్తున్నది. డ్రగ్ ముఠా నాయకుడు కెల్విన్తో ఉన్న సంబంధాలపై సిట్ అధికారులు ఆరా తీయనున్నారు. ఇవాళ ఉదయం 10.30 నిమిషాలకు అబ్కారీ ఆఫీసుకు రావాలంటూ పూరీకి నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసుల ప్రకారమే ఆయన ఇవాళ ముందుగానే ఆఫీసుకు చేరుకున్నాడు. పూరీతో పాటు ఆయన కుమారుడు, సోదరుడు, ఆయన తరపున న్యాయవాది కూడా సిట్ ఆఫీసుకు వచ్చారు. నగరంలో కొకైన్, హెరైన్ లాంటి మాదకద్రవ్యాలను అమ్ముతున్న కెల్విన్తో పూరీకి ఎటువంటి సంబంధాలు ఉన్నాయన్న కోణంలో సిట్ అధికారులు విచారణ జరపనున్నారు. విచారణ నేపథ్యంలో ఎక్సైజ్ ఆఫీసు దగ్గర కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఎక్సైజ్ శాఖలోని సెక్షన్ 67 ప్రకారం పూరీని విచారిస్తున్నట్లు తెలుస్తున్నది. కెల్విన్తో పూరీ వాట్సాప్ ద్వారా సంబంధాలు కొనసాగించాడు. అయితే ఆ అంశాన్ని సిట్ అధికారులు ప్రశ్నించనున్నారు. కెల్విన్ వ్యాట్సాప్లో పూరీ బ్యాంక్ ఆర్థిక లావాదేవీల గురించి కూడా మెసేజ్ చేసినట్లు సమాచారం. కెల్విన్కు పూరీ ఎందుకు సందేశాలు పంపాడు, వారిద్దరి మధ్య జరిగిన లావాదేవీలు ఏంటన్న అంశాన్ని తేల్చనున్నారు. ఒకవేళ కెల్విన్ దగ్గర పూరీ డ్రగ్స్ తీసుకున్నట్లు అంగీకరిస్తే, అది ఆయన కోసమా లేక అమ్మేందుకు తీసుకున్నాడా అన్న కోణంలోనూ విచారణ కొనసాగనున్నది. పూరీ జగన్నాథ్కు సుదీర్ఘ ఫిల్మ్ కెరీర్ ఉన్న నేపథ్యంలో ఆయనపై సిట్ అధికారులు లోతుగానే ప్రశ్నల వర్షం కురిపించే అవకాశాలున్నాయి.