పార్టీ పనితీరుపై సీనియర్ నేతలు విమర్శలు చేస్తున్నప్పటికీ కాంగ్రెస్ ఆత్మపరిశీలనకు సిద్ధంగా ఉన్నట్లు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఈ సాయంత్రం కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక అడ్వైజరీ కమిటీ భేటీ కానుంది. మంగళవారం సాయంత్రం 5 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశం జరుగనుంది. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని దేశ ప్రజలు ప్రత్యామ్నాయంగా భావించడంలేదన్న కపిల్ సిబల్ వ్యాఖ్యల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది.
అయితే, ఈ భేటీలో బీహార్ ఎన్నికలు, కాంగ్రెస్ ఘోర పరాజయం అంశం చర్చకు వచ్చే అవకాశం లేదని, ఆ అంశం సమావేశం ఎజెండాలో లేదని, ఈ సమావేశంలో సాధారణ పాలనా సమస్యలపై చర్చిస్తారని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. కాగా, పార్టీ అధినాయకత్వ వైఖరిని తప్పుబడుతూ గత ఆగస్టులో 23 మంది కాంగ్రెస్ సీనియర్ నేతలు లేఖ రాశారు. దాంతో పార్టీ సంస్థాగత, కార్యనిర్వాహక అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకునేందుకు అధ్యక్షురాలు సోనియాగాంధీ అడ్వైజరీ కమిటీనీ ఏర్పాటు చేశారు.ఈ అడ్వయిజరీ కమిటీలో కేసీ వేణుగోపాల్, ఏకే ఆంటోనీ, అంబికా సోనీ, ముకుల్ వాస్నిక్, రణదీప్ సుర్జేవాలా సభ్యులుగా ఉన్నారు. అయితే, మంగళవారం జరుగుతున్న అడ్వయిజరీ కమిటీ భేటీకి సోనియాగాంధీ అందుబాటులో ఉండటంలేదు. దాంతో తాజా భేటీలో బీహార్ ఫలితాలపై ఎలాంటి చర్చ జరిగే అవకాశం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.