గ్రేటర్ నోయిడా రహదారిపై రెప్పపాటులో భారీ యాక్సిడెంట్ చోటు చేసుకుంది. లాంబోర్గని కారు, స్విఫ్ట్ డిజైర్ కారు రెండూ కలసి ఆడిన ఓవర్ టేక్ ఆటలో మారుతి ఎకో నడుపుతున్న 20 ఏళ్ల యువకుడు బలయ్యాడు. గ్రేటర్ నోయిడా ఎక్స్ప్రెస్ వే మీద జరిగిన ఈ యాక్సిడెంట్ దృశ్యాలు అక్కడి ట్రాఫిక్ కెమెరాలో రికార్డయ్యాయి. ముందు వెళ్తున్న లంబోర్గిని కారును అతి సమీపం నుంచి ఓ స్విస్ట్ డిజైర్ కారు ఓవర్ టేక్ చేయడంతో వెనకాలే వస్తున్న మరో మారుతి ఎకో కారు అనూహ్యంగా ప్రమాదానికి గురైంది. ఢిల్లీకి సమీపంలోని నోయిడా సెక్టార్ 135వద్ద ఈ ప్రమాద ఘటన జరిగింది. ముందు వేగంగా దూసుకెళ్తున్న లంబోర్గిని కారును స్విస్ట్ డిజైర్ కారు అతి సమీపం నుంచి ఓవర్ టేక్ చేసింది. దాంతో లంబోర్గిని డ్రైవర్ కారును ఒక్కసారిగా కాస్త ఎడమ పక్కగా తిప్పాడు. ఈ అనూహ్య పరిణామానికి అప్పటికే అదే లైన్ లో వేగంగా దూసుకొస్తున్న మారుతీ ఎకో ప్రమాదానికి గురైంది. లంబోర్గిని కారును ఢీకొట్టి పల్టీలు కొడుతూ.. రోడ్డు పక్క అడవి పొదల్లో పడిపోయింది. దీంతో మారుతి ఎకో నడుపుతున్న 20ఏళ్ల యువకుడు అర్షద్ అహ్మద్ అక్కడిక్కడే మరణించాడు. ప్రమాదానికి కారణమైన స్విఫ్ట్ డిజైర్ డ్రైవర్ను పోలీసులు అరెస్టు చేయగా, లాంబోర్గని డ్రైవర్ ఆచూకీ ఇంకా తెలియరాలేదు. సీసీటీవి కెమెరాలో ప్రమాద దృశ్యాలు రికార్డవడంతో ప్రస్తుతం ఆ దృశ్యాలు మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.