ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీఎం జగన్, విజయసాయిరెడ్డిపై ఎంపీ రఘురామ సంచలన వ్యాఖ్యలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 15, 2020, 03:23 PM

ఏపీ మంత్రులు, వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై విరుచుకుపడ్డారు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు. ఇటీవల కరోనా బారినపడ్డ మంత్రుల విషయాన్ని ప్రస్తావిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి వెల్లంపల్లిని ప్రత్యేక హెలికాప్టర్‌లో హైదరాబాద్ తరలించారని తెలిసిందని.. ఆయన కోలుకోవాలని కోరుకుంటున్నాను అన్నారు. కానీ గతంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడికి పైల్స్ ఆపరేషన్ జరిగినా పట్టించుకోకుండా 20 గంటలు ప్రయాణం చేయించారు.. ఆయనకు కరోనా వస్తే ప్రభుత్వ ఆస్పత్రి నుంచి ప్రైవేట్ ఆస్పత్రికి తరలించమంటే దానికి కూడా ప్రభుత్వం అభ్యంతరం చెప్పిందని గుర్తు చేశారు.అచ్చెన్నను టార్గెట్ చేస్తూ.. ఎంపీ విజయసాయిరెడ్డి ఇక్కడ ఆస్పత్రులు లేవా అన్నారని గుర్తు చేశారు రఘురామ. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆస్పత్రలన్నీ కార్పొరేట్ ఆస్పత్రుల కంటే మిన్నగా ఉన్నాయి చూడలేదా అని ట్వీట్ చేశారని.. ఆ మాట చెప్పిన ఆయనకే కరోనా వస్తే హైదరాబాద్ వెళ్లి ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారని ఎద్దేవా చేశారు. మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, పెద్దిరెడ్డి, చెల్లుబోయిన వేణు, వైవీ సుబ్బారెడ్డికి కరోనా వస్తే హైదరాబాద్ వెళ్లారని.. ఎమ్మెల్యేలు కొట్టు సత్యనారాయణ, దొరబాబులు కూడా ప్రత్యేక హెలికాప్టర్‌లో బెంగళూరు వెళ్లారని గుర్తు చేశారు.


మంత్రులు, ఎమ్మెల్యేలు ఇలా పొరుగు రాష్ట్రాలకు వెళితే.. మరి ఏపీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకొచ్చిన గొప్ప, గొప్ప ఆస్పత్రుల్లో ఉత్తమ వైద్యం చేయించుకుంటుంది ఎవరు అని ప్రశ్నించారు ఎంపీ. జగనన్న ఆస్పత్రి పథకాలు ఏమయ్యాయి..అచ్చెన్నాయుడుకు ఒక న్యాయం మంత్రులకు ఒక న్యాయమా అన్నారు. ప్రజలకు ఆస్పత్రిలో బెడ్ దొరకదు.. మంత్రులకు మాత్రం హెలికాప్టర్లు ఇచ్చి ఎక్కడికి కావాలంటే అక్కడికి పంపిస్తారని మండిపడ్డారు. ప్రజల్ని కూడా ప్రేమగా చూసుకోవాలి.. ప్రెస్‌మీట్లు పెట్టి ఉత్తుత్తి స్టేట్మెంట్‌లు ఎందుకన్నారు. బెడ్ అరగంటలో ఇవ్వాలని సీఎం చెప్పారు.. కానీ నాలుగు రోజులైనా బెడ్లు దొరకలేదన్నారు. అచ్చెన్నాయుడ్ని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించాలని ఆదేశించిన న్యాయమూర్తిపైనా తప్పుడు ఆరోపణలు చేశారని మండిపడ్డారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com