శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సప్తగిరులు ముస్తాబయ్యాయి. బ్రహ్మోత్సవాలకు రారమ్మంటూ ముక్కోటి దేవతలను, భక్తకోటిని ఆహ్వానిస్తూ శుక్రవారం సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్య అంకురార్పణ నిర్వహిస్తారు. శనివారం ధ్వజారోహణంతో ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలు 27వ తేదీ వరకు జరగనున్నాయి. తితిదే ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేసింది. శనివారం సాయంత్రం 6.03 నుంచి 6.30గంటల మధ్య మీనలగ్నంలో ధ్వజారోహణ కార్యక్రమం జరగనుంది. 8.30 నుంచి 9.30 గంటల వరకు పెద్దశేష వాహనం నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల క్షేత్రం శోభాయమానంగా వెలుగొందుతోంది. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా శ్రీవారి ఆలయం, తిరుమల ప్రవేశమార్గాలు, కూడళ్లలో అలంకరణలు పూర్తిచేశారు.