ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎలుక వల్ల రూ.కోటి నష్టం!

national |  Suryaa Desk  | Published : Fri, Aug 21, 2020, 05:30 PM

ఎలుకే ఇంటికి నిప్పుపెట్టి అపార నష్టానికి కారణమైన ఓ ఘటన సంచలనం సృష్టించింది. హైదరాబాద్‌లో జరిగిన అగ్ని ప్రమాదంపై ఓ ప్రముఖ ఫోరెన్సిక్ సంస్థ విచారణలో ఈ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. సీసీటీవీ ఫుటేజితో నిగ్గుతేలిన ఈ వ్యవహారం కలకలం రేపుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరి 8న ముషీరాబాద్‌లోని మిత్రా మోటార్స్ అనే ఓ కార్ సర్వీస్ సెంటర్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అర్థరాత్రి దాటాక జరిగిన ఈ ఘటనలో మూడు కార్లు, ఫర్నీచర్ తగలబడడంతో రూ.1 కోటికి పైనా నష్టం జరిగినట్టు సదరు కంపెనీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ జరిపిన పోలీసులు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగిందంటూ కేసు మూసేశారు. అయితే ఆ రోజు రాత్రి సీసీటీవీని క్షుణ్ణంగా పరీక్షించిన ట్రూత్ ల్యాబ్స్ ఫోరెన్సిక్ సంస్థ దాదాపు ఆరు నెలల తర్వాత ఈ అగ్నిప్రమాదం ఎలా జరిగిందన్నది కళ్లకు కట్టినట్టు బయటపెట్టింది.ఫిబ్రవరి 7న ఉదయం 10 గంటలకు పూజ కోసం ఓ ఉద్యోగి దీపం వెలిగించినట్టు సీసీఫుటేజిలో కనిపించింది. గదిలో అంతగా గాలి వీయకపోవడం వల్ల ఆ దీపం రాత్రి వరకు వెలుగుతూనే ఉంది. రాత్రి 11:51 సమయంలో కస్టమర్ సర్వీస్ రూంలోని ఓ టేబుల్‌పై ఎలుక తచ్చాడుతూ కనిపించింది. 11:55కి ఆ ఎలుక ఏదో నిప్పులాంటి వస్తువు పట్టుకుని తిరిగింది. అంతలోనే దాన్ని తీసుకెళ్లి ఓ కుర్చీ దగ్గర వదిలేసింది. బహుశా పూజ కోసం దీపంలో వెలిగించిన వొత్తిని లాక్కొచ్చినట్టు భావిస్తున్నారు. కుర్చీలో పడిన కొద్ది నిమిషాలకు అంటే 12:06కి ఆ నిప్పు రగులుకోవడం, మంటలు రేగడం జరిగిపోయింది. చూస్తుండగానే పెద్దఎత్తున అగ్నికీలలు కింది ఫ్లోర్‌లోకి ప్రవేశించాయి. ఆఫీస్ ఫర్నీచర్‌తో పాటు అక్కడ రిపేర్ కోసం ఉంచిన కార్లను కూడా బుగ్గిచేసేశాయి. మొత్తానికి ఓ ఎలుక వల్ల భారీ నష్టం వాటిల్లింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com