విద్యా వ్యాపారాన్ని నియంత్రించలేని జాతీయ విద్యను వ్యతిరేకించాలని, ఎమ్మిగనూరులో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం( పిడిఎస్యు) జిల్లా ఉపాధ్యక్షుడు బి.మహేంద్ర బాబు పిలుపునిచ్చారు. అనంతరం స్థానిక ఎమ్మిగనూరు పట్టణంలో న్యూడెమోక్రసీ కార్యాలయంలో ప్లే కార్డ్స్ తో నిరసన దీక్ష చేయడం జరిగింది. ఈ సందర్భంగా బి.మహేంద్ర బాబు మాట్లాడుతూ నూతన జాతీయ విద్యా విధానం పేరుతో కస్తూరి రంగన్ ఇచ్చిన నివేదిక ప్రజా ప్రయోజనాలకి వ్యతిరేకమని అన్నారు.కేంద్ర మంత్రివర్గం పార్లమెంటులో చర్చ లేకుండానే దీన్ని ఆమోదించడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. భారత రాజ్యాంగ విలువలు అయిన సోషలిజం, సెక్యులరిజం, సామాజిక న్యాయం లాంటి వాటికి ఇందులో కనీసం చోటు లేదన్నారు. రాష్ట్రాల అధికారాలను హరించి ఢిల్లీ నుండి నేరుగా నియంత్రించాలని చూడడం హేయమైనదన్నారు. ఇది రాష్ట్రాల ఫెడరల్ హక్కులకు వ్యతిరేకమైనదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బిసి, ఓబిసి, మైనారిటీ, మహిళా రిజర్వేషన్ల ప్రస్తావన లేదని విమర్శించారు.నూతన విద్యా విధానం సామాజిక న్యాయానికి వ్యతిరేకమైనది అన్నారు. ముఖ్యంగా విద్యా వ్యాపారాన్ని అరికట్టాలని ఇందులో పేర్కొనక పోవడం దుర్మార్గమన్నారు. ధార్మిక సంస్థల పేరుతో ప్రైవేటు, రాజకీయ భావజాల సంస్థలకు ప్రభుత్వ నిధులను బదలాయింపు చేయడం ప్రభుత్వ ఉద్దేశమని విమర్శించారు. బిజెపి, ఆర్ఎస్ఎస్ రహస్య ఎజెండా లో భాగంగానే నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. విద్యారంగ కాషాయీకరణ, కార్పొరేటీకరణ లక్ష్యంగానే కేంద్రం నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలు చేస్తోందని దుయ్యబట్టారు. బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ పేరుతో విశ్వవిద్యాలయాలను స్వయంప్రతిపత్తి కోల్పోయేలా చేస్తుందన్నారు.స్వయంప్రతిపత్తి సంస్థలను రద్దు చేసి ఒకే యాజమాన్య సంస్థను ఏర్పాటు చేయడం సహేతుకం కాదన్నారు. విశ్వవిద్యాలయాలకు, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, ప్రజాప్రయోజనాలకు విరుద్ధమైన నూతన జాతీయ విద్యా విధానాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని లేనిపక్షంలో దీనికి వ్యతిరేకంగా ఉద్యమిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పి.డి.ఎస్.యు నాయకులు శివరామరాజు, జయకృష్ణ, మల్లి, నరసింహ రెడ్డి, ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.