కరువు కాటకాలతో వెనుకబడిన ఆదోనిని జిల్లాగా ప్రకటించాలని ఆదోని జిల్లా సమితి సభ్యులు చంద్రశేఖర్, రామలింగయ్య కోరారు. గురువారం ఆలూరు తహల్దార్ హుస్సేన్ సాహెబ్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా వెనుకబడిన ఆదోని డివిజన్ని జిల్లాగా ప్రకటించాలని కోరారు. ఈ డివిజన్లో అధిక శాతం వర్షాధారంపై రైతులు ఆధారపడి జీవిస్తున్నారన్నారు.యువత నిరుద్యోగంతో చెడు వ్యసనాలకు అలవాటుపడి జీవితాలు నాశనం చేసుకుంటున్నారనన్నారు. రెండవ ముంబై గా పేరుగాంచిన ఆదోని డివిజన్లో వ్యాపారం, పరిశ్రమలు, రైతాంగం విచ్ఛిన్నమై ఉపాధిలేక వలస బాట పడుతున్నారు. ఆదోని డివిజన్ కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, జూనియర్ కళాశాల లేకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వం ఆదోని డివిజన్ని జిల్లాగా ప్రకటించి అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తిక్కస్వామి, గణేష్ ఆచారి పాల్గొన్నారు.