ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నెలకు రూ.5,000 పెన్షన్‌ తెచ్చిపెట్టే స్కీమ్‌ ఇదే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 05, 2020, 07:23 PM

రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ పొందాలనుకునేవారికి అద్భుతమైన స్కీమ్ ఉంది. అటల్ పెన్షన్ యోజన మీకు బాగా ఉపయోగపడే పథకం. మీ వయస్సు తక్కువ ఉన్నప్పుడే ఈ స్కీమ్‌లో చేరితే తక్కువ పొదుపు చేసి ఎక్కువ పెన్షన్ పొందొచ్చు. ఉదాహరణకు మీ వయస్సు 22 అయితే మీరు నెలకు రూ.5,000 పెన్షన్ పొందాలంటే నెలకు రూ.292 మాత్రమే పొదుపు చేయాలి. అంటే రోజుకు రూ.10 పొదుపు చేస్తే చాలు. నెలకు రూ.5,000 పెన్షన్ పొందొచ్చు. అదే మీ వయస్సు 18 ఏళ్లు అయితే రోజుకు రూ.7 చొప్పున నెలకు రూ.210 పొదుపు చేస్తే చాలు రిటైర్మెంట్ తర్వాత నెలకు రూ.5,000 పెన్షన్ పొందొచ్చు. ఒకవేళ 40 ఏళ్ల వయస్సులో ఈ స్కీమ్‌లో చేరి రూ.5,000 పెన్షన్ పొందాలనుకుంటే నెలకు రూ.1,454 జమ చేయాలి.ఈ స్కీమ్‌లో ఎంత తక్కువ వయస్సులో చేరితే అంత తక్కువ పొదుపు చేయొచ్చు. మీ వయస్సు పెరిగినకొద్దీ పొదుపు చేయాల్సిన మొత్తం పెరుగుతుంది. వృద్ధాప్యంలో ఆర్థికంగా చేయూతను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అటల్ పెన్షన్ యోజన పథకాన్ని ప్రారంభించింది. ఈ స్కీమ్‌ను పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ-PFRDA నిర్వహిస్తుంది. రిటైర్మెంట్ తర్వాత నెలనెలా పెన్షన్ కోరుకునేవారికి ఇది మంచి పొదుపు పథకం. 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారెవరైనా ఈ స్కీమ్‌లో చేరొచ్చు. బ్యాంకులో లేదా పోస్ట్ ఆఫీస్‌లో సేవింగ్స్ అకౌంట్ ఉన్నవారు ఈ స్కీమ్‌ను ఎంచుకోవచ్చు. నెలకు, మూడు నెలలకు, ఆరు నెలలకోసారి డబ్బులు జమ చేయొచ్చు. మీరు ఈ పథకంలో చేరిన నాటి నుంచి మీ 60 ఏళ్ల వయస్సు వచ్చే వరకు పొదుపు చేయాలి. మీకు 60 ఏళ్లు పూర్తైన నాటి నుంచి నెలకు పెన్షన్ లభిస్తుంది. మీకు ఎంత పెన్షన్ కావాలో మీరు ముందే నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. దాన్ని బట్టి మీరు పొదుపు చేయాల్సిన మొత్తాన్ని లెక్కిస్తారు. మీరు పొందాలనుకునే పెన్షన్, మీ వయస్సుపై మీరు జమ చేయాల్సిన మొత్తం ఆధారపడి ఉంటుంది. నెలకు రూ.1,000 నుంచి రూ.5,000 వరకు పెన్షన్ పొందొచ్చు.కేవలం పెన్షన్ మాత్రమే కాదు లబ్ధిదారులు మరణిస్తే నామినీకి పెన్షన్ కార్పస్ కూడా లభిస్తుంది. రూ.1,000 పెన్షన్ పొందేవారికి రూ.1,70,000, రూ.2,000 పెన్షన్ పొందేవారికి రూ.3,40,000, రూ.3,000 పెన్షన్ పొందేవారికి రూ.5,10,000, రూ.4,000 పెన్షన్ పొందేవారికి రూ.6,80,000, రూ.5,000 పెన్షన్ పొందేవారికి రూ.8,50,000 చొప్పున పెన్షన్ కార్పస్ లభిస్తుంది. ఆలస్యంగా పేమెంట్ చేస్తే నెలకు ప్రతీ వందకు రూ.1 జరిమానా చెల్లించాలి. పథకాన్ని మధ్యలో నిలిపేసినవాళ్లు పెనాల్టీ చెల్లించి రెన్యువల్ చేసుకోవచ్చు. పథకాన్ని మధ్యలో ఆపెయ్యాలనుకుంటే అకౌంట్ మెయింటనెన్స్ ఛార్జీలు చెల్లించి జమ చేసిన మొత్తాన్ని వెనక్కి తీసుకోవచ్చు. ఈ స్కీమ్‌లో చేరినవాళ్లు 60 ఏళ్ల లోపు చనిపోతే జీవిత భాగస్వామి అటల్ పెన్షన్ యోజన అకౌంట్‌ను కొనసాగించొచ్చు. ఒకవేళ భార్యాభర్తలు ఇద్దరూ చనిపోతే నామినీకి పెన్షన్ కార్పస్ లభిస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com