కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఉన్న గ్రామ రెవెన్యూ సహాయకులకు గ్రేడ్-2 వీఆర్వోలుగా పదోన్నతులు కల్పించనున్నారు. జిల్లా వ్యాప్తంగా 266 కొలువులను భర్తీ చేయనున్నారు. జిల్లా రెవెన్యూ యంత్రాంగం పదోన్నతులకు అర్హులైన గ్రామ రెవెన్యూ సహాయకుల జాబితాను విడుదల చేసింది.ఈ జాబితాలో ఇంటర్మీడియట్ విద్యార్హత ఉండి ఐదేళ్లపాటు వీఆర్ఏగా పని చేసిన మొత్తం 472 మంది అర్హుల జాబితాను మూడు రెవెన్యూ డివిజన్ల కార్యాలయాల్లో ప్రదర్శించింది. కాగా, జిల్లా రెవెన్యూ యంత్రాంగం తయారుచేసిన జాబితా అస్తవ్యస్తంగా ఉంది.జాబితాలో రెండో పేరు ఉన్న వీఆర్ఏ పేరు బి.నాగరాజు. ఈయన 1981 జూన్ 1న జన్మించారు. 1998 జులై 6న వీఆర్ఏగా కారుణ్య నియామకం కింద ఉద్యోగంలో చేరినట్లు జాబితాలో పొందుపరిచారు. ఆయన ఉద్యోగంలో చేరిన నాటికి 17 ఏళ్ల వయసు ఉంది. ప్రభుత్వ ఉద్యోగంలో చేరేందుకు 18 సంవత్సరాల వయసు ఉండాలి.ఇంత గుడ్డిగా జాబితాను తయారు చేశారంటే రెవెన్యూ యంత్రాంగం పనితీరు ఎలా ఉందో దీన్ని బట్టే అర్థమవుతుంది. కొందరు వీఆర్ఏలు వీఆర్వోగా పదోన్నతుల కోసం బోగస్ విద్యార్హత ధ్రువపత్రాలు కలిగి ఉన్నారనే విమర్శలున్నాయి.తమ తల్లిదండ్రుల్లో ఎవరైనా వీఆర్ఏగా పనిచేస్తూ చనిపోతే కారుణ్య నియామకం కింద కుమారులు, కుమార్తెలు వీఆర్ఏలుగా ఉద్యోగంలో చేరతారు. చాలామందికి తమ తల్లిదండ్రులున్నా కారుణ్య నియామకం కింద ఉద్యోగంలో చేరినట్లు జాబితాలో తెలియపరిచారు.వీరిలో చాలామంది వీఆర్ఏల తల్లిదండ్రులు బతికే ఉన్నారు. ప్రస్తుతం ధ్రువపత్రాల పరిశీలనలో కారుణ్య నియామకం కింద నియమితులైన వీఆర్ఏలు తమ తండ్రి లేదా తల్లి వీఆర్ఏగా పనిచేస్తూ చనిపోయినట్లు మరణ ధ్రువపత్రాలు చూపాలి. బతికున్న వారిని చనిపోయినట్లు ధ్రువపత్రాలు ఎలా చూపుతారో మరి.జిల్లా కేంద్రం పరిసర మండలాలతోపాటు చాగలమర్రి, రుద్రవరం, నంద్యాల, పశ్చిమ ప్రాంతమైన ఆదోని డివిజన్లో ఎక్కువగా అవకతవకలు జరిగాయనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. తల్లిదండ్రులు అనారోగ్యంతో ఉన్నప్పుడు వీఆర్ఏగా ఉద్యోగం చేయలేని స్థితిలో ఉన్నవారు మెడికల్ గ్రౌండ్స్ కింద కుటుంబ సభ్యులు వీఆర్ఏగా ఉద్యోగంలో చేరడం జరుగుతుంది. వంద మందికి పైగా కారుణ్య నియామకం కింద వీఆర్ఏలుగా ఉద్యోగం చేస్తున్నట్లు చూపారు.