యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ అన్ని వర్గాల ప్రజలకు ఒక శాపంగా మారింది. ఒక వైపు వైరస్ వ్యాప్తి, మరో వైపు వ్యాపార లావాదేవీలు నిలిచిపోయి తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నారు. కాగా స్మైల్ ప్లీజ్ అంటూ క్లిక్ మనిపిస్తూ పది కాలాలు పాటు గుర్తుండిపోయే జ్ఞాపకాలు అందించే ఫొటో, వీడియో గ్రాఫర్లకు కరోనా వైరస్ వల్ల జీవితంలో కోలుకోలేని దెబ్బతీసింది.శుభకార్యాలు, వివాహం, రిసెప్షన్, జన్మదినోత్సవం, కార్యక్రమం, పదవీ విరమణ, పాఠశాల వార్షికోత్సవం, పండగ ఇలా ఏదైనా సరే ప్రస్తుత జీవన విధాన రోజుల్లో ఫొటోలు, వీడియో తప్పనిసరిగా మారాయి. ప్రజలకు వారీ జ్ఞాపకాలను అందిస్తూ, వారి జీవనం సాగించే ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్ అందరూ వ్యాపార లావాదేవీలు నిలిచిపోయి, దుకాణాలకు అద్దెలు కట్టాలేక, మరో వైపు కుటుంబ పోషణ జరపలేక నానావస్థలు పడుతున్నారు.మార్కెట్లోకి మొబైల్స్, చేతి కెమేరాలు అందుబాటులోకి వచ్చిన ఫొటోగ్రాఫర్లు, వీడియోలకు గిరాకీ తగ్గలేదు. అయితే, మార్చి నెలలో ప్రారంభమైన కరోనా మహమ్మారి వారి జీవితాలను దయనీయంగా మార్చింది. నాలుగు నెలలుగా శుభ కార్యాలు లేకపోవడంతో కెమేరాలకు పనికరువైంది. స్టూడియోల్లో పని చేస్తున్న వర్కర్లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్టూడియోల అద్దెలు, మంత్లీ వాయిదాలు, వర్కర్లకు జీతాలు చెల్లించలేక నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్నారు.ఈ పరిస్థితుల్లో జిల్లాలో వేలాది మంది ఫొటోగ్రాఫర్లు, వర్కర్లు సాయం కోసం ఎదురు చూస్తున్నారు. కరోనాతో కనీస ఆదాయం లేక అవస్థలు పడుతున్న తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ రాష్ట్ర ఫొటో, వీడియో గ్రాఫర్ల సంక్షేమ సంఘం తరుపున కోరుతున్నారు. 2020 మార్చి 24 నుంచి ఏర్పడిన లాక్డౌన్ కారణంగా అంత వరకు జరగాల్సిన పెళ్లిళ్లు తాత్కాలికంగా నిలిచిపోవడంతో ఉన్న బుకింగ్లు అన్నీ రద్దయ్యాయి.దీంతో వేలాది మందికి పని లేకపోవడంతో వారిపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలు కూడా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది. అప్పటికే ఉన్న బుకింగ్లు రద్దవ్వడం, కొత్త కార్యక్రమాలు లేకపోవడం, దాదాపు నెలన్నర వరకు లాక్డౌన్ ఉండడంతో ఫొటో స్టూడియోలు తెరుచుకోని పరిస్థితి ఏర్పడింది.కరోనా వైరస్ పుణ్యమాని కర్నూలు జిల్లాలోని ఫొటో, వీడియో గ్రాఫర్లకు తీవ్ర కష్టాలు ఏర్పడ్డాయి. లాక్డౌన్ కారణంగా మొత్తం వ్యాపారం మూతపడింది. ఎప్పటికి కోలుకుంటుందో తెలియని పరిస్థితి నెలకొంది. నాలుగు నెలలుగా స్టూడియో తెరుచుకోక, అవుట్డోర్ బుకింగ్లు లేక అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఒకవేళ తెరుచుకున్న కరోనా వైరస్ ప్రభావంతో వ్యాపారాలు లేక నానావస్థలు పడుతున్నారు. స్టూడియోల్లో పని చేస్తున్న వర్కర్లకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటున్న వైసీపీ ప్రభుత్వం తమను ఆదుకోవాలని జిల్లా వ్యాప్తంగా ఫోటో, వీడియో గ్రాఫర్లు కోరుతున్నారు.