లాక్డౌన్ 5లో ఏపీ ప్రభుత్వం మరిన్ని సడలింపులు ఇచ్చింది. జూన్ 8 నుంచి అన్లాక్ 1 మొదలవుతుందని ఇప్పటికే కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలో జూన్ 8 నుంచి రాష్ట్రంలో హోటళ్లు, రెస్టారెంట్లకు ఏపీ సర్కార్ అనుమతి ఇచ్చింది. కోవిడ్ 19 నియమ నిబంధనలను అనుగుణంగా పలు సూచనలతో హోటళ్లు, రెస్టారెంట్లు నడుపుకునేందుకు అనుమతి ఇస్తున్నట్లు ఏపీ పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు.ఏపీలో హోటళ్ల పునః ప్రారంభంపై ఒకటి రెండు రోజుల్లో రాష్ట్ర హోటల్ సమాఖ్యతో చర్చిస్తామని చెప్పారు. కరోనా లాక్డౌన్ వల్ల హోటల్స్ నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని మంత్రి అవంతి అన్నారు. ఈ క్రమంలోనే తగిన జాగ్రత్తలు తీసుకుంటూ హోటళ్లు నడిపేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని, త్వరలోనే గైడ్ లైన్స్ విడుదల చేస్తామని అవంతి వెల్లడించారు.