ఏపీ సర్కార్ విద్యార్దులకు శుభవార్త చెప్పింది. జగనన్న విద్యా కానుక పథకం కింద 1నుంచి 10వ తరగతి వరకు చదివే విద్యార్దులకు 7 రకాల వస్తువులను కానుకగా అందజేయనున్నారు. విద్యార్దులకు కిట్ రూపంలో పాఠశాలలు ప్రారంభమైన మొదటి రోజే కానుకను అందజేయనున్నారు. ఈ కానుకలో 3 జతల దుస్తుల వస్త్రం, బెల్టు, ఒక జత షూ, రెండు జతల సాక్స్, పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, స్కూల్ బ్యాగ్ అందిస్తారు. అదే విధంగా దుస్తుల వస్త్రాన్ని పాఠశాలల పేరెంట్స్ కమిటీల ద్వారా విద్యార్థుల తల్లులకు పంపిణీ చేయిస్తారు. ఒక్కో జతకు కుట్టుకూలి కింద రూ.40 చొప్పున వారి బ్యాంకు ఖాతాల్లోనే ప్రభుత్వం జమ చేయనుంది. విద్యార్దులు స్కూల్ కు వచ్చేందుకు అయ్యే బస్సు ఛార్జీలను ప్రభుత్వమే చెల్లించనుంది. వారు ఏ వాహనంలో వచ్చినా వారికి అయ్యే ఛార్జీని ప్రభుత్వమే అందించనుంది. కేవలం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్దులకు మాత్రమే ఈ పథకం వర్తించనుంది.