ఒక్క పామును చూస్తేనే మనం గజగజా వణికిపోతాం. అది వెళ్ళేదాకనో లేక మనం దాన్ని చంపేదాకనో ప్రాణాలు గుప్పిట్లో పట్టుకొని ఉంటాం. అలాంటిది ఒక వ్యక్తి తన ఇంటిలో వందకుపైగా పాముల మధ్య రాత్రంతా జాగారం చేశాడు. ఒళ్ళు జలదరించే ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని రాన్ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... గ్రామంలోని జీవన్ సింగ్ కుష్వాహ్ ఇంట్లో గత వారం రోజులుగా పాము పిల్లలు తిరుగుతున్నాయి. చీకటిపడితే చాలు పదుల సంఖ్యలో పాము పిల్లలు ప్రత్యక్షమవుతున్నాయి. భయభ్రాంతులకు గురైన జీవన్ సింగ్ కుటుంబం వేరే గ్రామానికి వెళ్ళిపోయింది. దొంగల భయంతో అతను ఇటీవలే ఇంటికి తిరిగి వచ్చాడు. అతడు కుర్చీలో కుర్చొని ఉండగా ఒక్కసారే పదుల సంఖ్యలో పాము పిల్లలు బయటకు వచ్చాయి. దీంతో జీవన్ సింగ్ రాత్రంతా వాటిని చూస్తూ భయంభయంగా గడిపాడు. జీవన్ సింగ్ ఇచ్చిన సమాచారంతో అక్కడికి వచ్చిన అటవీ అధికారులు అన్నిపాములను చూసి షాక్ అయ్యారు. మొత్తం 123 పాము పిల్లలను పట్టుకుని అతని ఇంటిలో పాములా స్థావరాన్ని వెతికేపనిలో పడ్డారు.