నాలుగురోజులపాటు రాష్ట్రంలో భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. ఐఎండీ సూచనల ప్రకారం మే 22 నుంచి 25 వరకు నాలుగు రోజుల పాటు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది. ఈ క్రమంలో ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు చేయవలసినవి, చేయకూడని పనులు అంటూ విపత్తు నిర్వహణ శాఖ కొన్ని సూచనలు చేసింది.
చేయవలసిన పనులు:
తప్పనిసరిగా గొడుగు వాడాలి.
తెలుపు రంగు పలుచటి కాటన్ వస్త్రాలు ధరించాలి.
తలకు టోపీ, లేదా రుమాలు పెట్టుకోవాలి.
ఉప్పు కలిపిన మజ్జిగ లేదా గ్లూకొజు కలిపిన నీరు తాగొచ్చు. లేదా ఓరల్ డీహైడ్రేషన్ ద్రావణం తాగవచ్చు.
వడదెబ్బకు గురి అయిన వారిని శీతల ప్రాంతానికి వెంటనే చేర్చాలి. తడిగుడ్డతో శరీరం అంతా రుద్దుతూ ఉండాలి. ఐస్ నీటిలో బట్టను ముంచి శరీరం అంతా తుడవాలి. శరీర ఉష్ణోగ్రత 101 డిగ్రీల కంటే లోపునకు వచ్చేవరకు ఐస్ వాటర్ బట్టతో శరీరాన్ని తుడుస్తూ ఉండాలి. ఫ్యాను క్రింద ఉంచాలి.
వడదెబ్బకు గురి అయినవారిలో మంచి మార్పులు లేనిచో శీతల వాతావరణంలో దగ్గరలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి తరలించాలి.
మంచి నీరు ఎక్కువ సార్లు త్రాగాలి.
ఇంటి నుంచి బయటకు వెళ్ళేముందు ఒక గ్లాసు మంచినీరు త్రాగాలి.
ఎండలో బయటి నుంచి వచ్చిన వెంటనే ఒక మాదిరైన చల్లని నిమ్మరసముగాని, కొబ్బరి నీరు లేదా చల్లని నీరు త్రాగాలి.
తీవ్రమైన ఎండలో బయటకి వెళ్ళినప్పుడు తలతిరుగుట మొదలైన అనారోగ్య సమస్య ఏర్పడితే దగ్గరలో వున్నా వైద్యుణ్ణి సంప్రదించి ప్రాధమిక చికిత్స పొంది వడ దెబ్బ బారిన పడకుండా కాపాడుకోవచ్చు.
చేయకూడనివి :
సూర్య కిరణాలకు, వేడి గాలికి గురి కాకుడదు.
వేడిగా ఉన్న సూర్య కాంతిలో గొడుగు లేకుండా తిరుగరాదు.
వేసవి కాలంలో నలుపురంగు దుస్తులు, మందంగా ఉండే దుస్తులు ధరించరాదు.
తలకు టోపి లేక రుమాలు లేకుండా సూర్య కాంతిలో తిరుగరాదు.
వడదెబ్బకు గురి అయిన వారిని వేడి నీటిలో ముంచిన బట్టతో తుడువరాదు. దగ్గరలోని ప్రాధమిక అరోగ్య కేంద్రానికి చేర్చుటలో ఏ మాత్రం ఆలస్యం చేయరాదు.
మధ్యాహ్నం తరువాత (అనగా ఉదయం 10.00 గంటల నుంచి సాయంత్రం 4.00 గంటల మధ్యకాలంలో) ఆరుబయట ఎక్కువ శారీరక శ్రమతో కూడిన పని పనిచేయరాదు.
ఎండలో బయట నుంచి వచ్చిన వెంటనే తీపిపదార్ధములు, తేనె తీసుకోకూడదు.
కూల్ డ్రింక్స్, మంచు ముక్కలు తీసుకుంటే గొంతుకు సంబంధించిన అనారోగ్యం బారిన పడే అవకాశముంది.