రేపటి నుంచి టీడీపీ ప్రజా చైతన్య యాత్రను ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై ఏపీ మంత్రి కన్నబాబు సెటైర్లు విసిరారు. సచివాలయంలో ఇవాళ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు చేయాల్సింది ప్రజాచైతన్య యాత్ర కాదు కాశీయాత్ర చేసిన ఉపయోగం లేదంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చంద్రబాబు బస్సు యాత్ర ఎందుకు చేస్తున్నట్టు? అని ప్రశ్నించారు. చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్ పై ఐటీ దాడుల్లో బయటపడ్డ అవినీతి వ్యవహారం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ఈ బస్సుయాత్ర అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఏ యాత్ర చేసినా ప్రజలు ఆయన్ని నమ్మే పరిస్థితి లేదని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం తీరును ఎండగట్టేందుకే బస్సు యాత్ర చేపడతామన్న టీడీపీ నేతలు, అసలు, ప్రభుత్వం చేసిన తప్పేంటో ముందు చెప్పాలి? అని ప్రశ్నించారు.