ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో గురువారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కేంద్రం ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగిలాయి. సీఏఏ వ్యతిరేక నినాదాలు చేస్తూ, సభలో ప్లకార్డులు ప్రదర్శించడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో కొందరు ఎమ్మెల్యేలు ఏకంగా ఎల్పీజీ సిలండర్లను భుజాన పెట్టుకుని రావడంతో ఒక్క సారిగా సభలో ఉన్నవారు ఉలిక్కిపడ్డారు. గవర్నర్ ఆనందీబేన్ పటేల్ ఆమె ఉపన్యాసాన్ని ప్రారంభించిన కొద్ది సేపటికే సమాజ్ వాదీ పార్టీ సభ్యులతో పాటు మరికొంత మంది విపక్ష సభ్యులు ఒక్కసారిగా నినాదాలు చేయడంతో పాటు సభలో కింద కూర్చొని నినాదాలు చేయడం ప్రారంభించారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం సంభవించింది. ఈ నేపథ్యంలో కేంద్రం తెచ్చిన సీఏఏతో పాటు ఎన్నార్సీపై కూడా ప్రభుత్వాన్ని నిలదీస్తామని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రకటించారు.