అమరావతి భూముల ఇన్ సైడర్ ట్రేడింగ్ వ్యవహారంపై సీఐడీ విచారణకు ఆదేశించడంతో దర్యాప్తులో మొదటి దశ ప్రారంభమైంది. మొదటి కేసు కింద టీడీపీ మాజీ మంత్రులు పి.నారాయమ, పత్తిపాటి పుల్లారావులపై పలు సెక్షన్ల కింద కేసు పెట్టడమే కాకుండా, ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద కూడా కేసు నమోదు చేశారు. తాడికొండ మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ బెల్లంకొండ నరసింహారావుపై కూడా మాజీ మంత్రులతో పాటు కేసు పెట్టారు. రాజధాని గ్రామాల్లో ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన అసైన్ మెంట్ భూముల్ని భూ సమీకరణ కింద ప్రభుత్వం లాక్కుంటుందని బెదిరించి, నరసింహారావు బలవంతంగా రాయించుకున్నారని, కేసు నమోదైంది. ఇలా రాయించుకున్న ఎస్సీ, ఎస్టీల పొలాలకు నష్టపరిహారం కింద డబ్బులు కూడా తీసేసుకున్నారు. ఇదికాకుండా 797మంది తెల్లరేషన్ కార్డుదారుల పేరుతో రాజధాని గ్రామాల్లో 38కోట్ల 56 లక్షల రిజిస్ట్రేషన్ విలువ కల 761 ఎకరాలు కొనుగోలు చేసినట్టు తేలింది. ఈ తెల్లరేషన్ కార్డుదారులంతా బినామీలుగా నిర్థారించారు. రాజధాని ప్రకటనకు ముందు భూములు కొన్నవారి విషయంలో కూడా మరో సీఐడీ బృందం దర్యాప్తు ప్రారంభించింది.