ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు సీఎం కేసీఆరే కారణమా..? రాజధాని మార్పుపై ఏపీ సీఎం జగన్ కు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సలహలు, సూచనలు చేశారా..? అంటే అవుననే అంటున్నారు ఏపీ, తెలంగాణ విపక్ష నేతలు. తెలంగాణలో ఒకవైపు మున్సిపల్ ఎన్నికలు ఏపీలో అమరావతి వివాదం రగులుతుండగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దాదాపు ఆరు గంటలపాటు సమావేశమయిన విషయం తెలిసిందే. అధికారులు లేకుండా జరిగిన సుదీర్ఘ భేటీ కావడంతో రాజకీయ వర్గాలను సైతం వీరి భేటి విస్మయానికి గురి చేసింది. అయితే మూడు రాజధానులపై సీఎం జగన్ కేసీఆర్ సలహాలు తీసుకున్నారని గతంలో వార్తలు వినిపించాయి.
సరిగ్గా ఇదే వాదనను ఏపీలో వామపక్షాలు చేస్తున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కోరిక మేరకు ఏపీ సీఎం మూడు రాజధానుల ప్రతిపాదనకు తెరపైకి తెచ్చారని ఏపీలో రాజకీయ పార్టీల నేతలు విమర్శలు చేస్తున్నారు. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ నేత వీహెచ్ చేసిన వ్యాఖ్యలు కూడ కలకలం రేపుతున్నాయి. కేసీఆర్ కోసమే జగన్ మూడు రాజధానులను ఏర్పాటు చేస్తున్నారని వీహెచ్ కామెంట్లు చేశారు. అయితే ఏపీలో మూడు రాజధానుల చేస్తే కేసీఆర్ వచ్చిన లాభమేంటో అర్థం కాని పరిస్థితి నెలకొంది. తన రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టుకోవడానికి కేసీఆర్ కు అనుకూలంగా జగన్ మూడు రాజధానుల ప్రతిపాదన ఎందుకు తెరపైకి తెస్తారన్నది రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
అయితే రాజధాని మార్పుపై కేసీఆర్ సలహాలు జగన్ తీసుకున్నారని తెలుస్తోంది. అమరావతి ప్రాంతంలో రాజధాని కరెక్టు కాదని.. విశాఖ ప్రాంతమైతే రాజధానికి అనువైన ప్రాంతంగా జగన్ కు కేసీఆర్ సూచనలు చేసినట్లు సమాచారం. ఇదే సమయంలో రాజధాని రైతులకు న్యాయం చేసే విధంగా మార్పు ఉంటేనే రాజకీయంగా నష్టం ఉండదని గులాబీ బాస్ ఏపీ ముఖ్యమంత్రికి చెప్పారట. ఏ పని చేసిన కూడా విపక్షాలు విమర్శిస్తూనే ఉంటాయని వారిని పట్టించుకోవద్దని జగన్ కు కేసీఆర్ కు సూచించారట. రైతులు చేస్తున్న ఆందోళనల పట్ల జాగ్రత్తగా ఉండాలని కూడ జగన్ కు కేసీఆర్ హెచ్చరించినట్టు తెలుస్తోంది. రాజధాని మార్పుపై కేసీఆర్ కేవలం సలహాలు మాత్రమే ఇచ్చారని ప్రగతి భవన్ వర్గాలు చెబుతుంటే... ఏపీ, తెలంగాణ నేతలు మాత్రం కేసీఆర్ కోసమే మూడు రాజధానులు అంటున్నారు. మొత్తమ్మీద ఏపీలో రాజధాని రగడ జరుగుతున్న వేళ అక్కడి పాలిటిక్స్ లో తెలంగాణ సీఎం కేసీఆర్ హాట్ టాపిక్ గా మారారు.