ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మాజీ ఎమ్మెల్యే చెంగలకు జీవిత ఖైదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, May 25, 2017, 02:28 AM

విశాఖపట్నం, సూర్య ప్రధాన ప్రతినిధి : ఓ హత్యకేసుకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకటరావుకు న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. విశాఖ జిల్లా నక్కపల్లి మండలం బంగారమ్మపేటలో 2007లో జరిగిన ఓ హత్యకేసులో మాజీ ఎమ్మెల్యే సహా 15 మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ అనకాపల్లి సెషన్స్‌ న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసుతో సంబంధం ఉన్న మరో ఐదుగురు మహిళలకు రెండేళ్ల పాటు జైలు శిక్ష విధించింది. ఈ కేసులో పోలీసులు మొత్తం 24 మందిని నిందితులుగా చేర్చగా వారిలో ముగ్గురు వివిధ కారణాలతో మృతిచెందారు. 2007లో బీచ్‌ మినరల్స్‌ కంపెనీ ఏర్పాటు విషయమై బంగారమ్మపేటలో వివాదం చెలరేగింది. మత్స్యకారులు రెండు వర్గాలుగా విడిపోయారు. ఆ సమయంలో పాయకరావుపేట ఎమ్మెల్యేగా ఉన్న చెంగల వెంకటరావు కంపెనీని వ్యతిరేకిస్తున్న వారితో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కంపెనీ ఏర్పాటుకు అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య తలెత్తిన ఘర్షణలో పూసాల కొండ అనే వ్యక్తి మృతిచెందాడు. ఈ కేసును విచారించిన న్యాయస్థానం బుధవారం సంచలన తీర్పు వెలువరించింది. గతంలో పాయకరావుపేట నియోజకవర్గం నుంచి తెదేపా తరపున ఎమ్మెల్యేగా పనిచేసిన చెంగల వెంకటరావు 2014 ఎన్నికల్లో వెకాపా తరఫున పోటీచేసి ఓటమిపాలయ్యారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com