ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నిర్వహించే పరీక్షల్లో ఇంటర్వ్యూ విధానాన్ని రద్దు చేయాలని నిర్ణయించారు. రాత పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ ఆధారంగా అత్యంత పారదర్శకంగా ఉద్యోగాలను భర్తీ చేయాలని ఆదేశించారు. ఏపీపీఎస్సీ ద్వారా ఉద్యోగాల భర్తీ తదితర అంశాలపై ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. పరీక్షల నిర్వహణ, ఇంటర్వ్యూ విధానాలపై చర్చించారు. ఫలితాల వెల్లడికి సంబంధించి అవినీతి, అక్రమాలపై ప్రతి సందర్భంలో ఆరోపణలు వస్తున్నన్నాయని అధికారులు సీఎంకు వివరించారు.
ఏపీపీఎస్సీ జారీ చేస్తున్న నోటిఫికేషన్లు కూడా న్యాయ వివాదాలకు దారి తీస్తున్నాయని చెప్పారు. వీటిపై కూలంకషంగా తెలుసుకున్న ముఖ్యమంత్రి పారదర్శక విధానాలపై చర్చించారు. అవినీతి, ఆశ్రిత పక్షపాతం లేకుండా పరీక్షలు నిర్వహించాలని నిర్దేశించారు. పరీక్షల నిర్వహణ, పోస్టుల భర్తీలో అత్యుత్తమ పారదర్శక విధానాలకు పెద్దపీట వేయాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేసే గ్రూప్-1, గ్రూప్-2 సహా అన్ని విభాగాల ఉద్యోగాలకూ ఇంటర్వ్యూ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని ఆదేశించారు.