రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి తన అనుచరులతో తన ఇంటిపైకి వచ్చి కుటుంబ సభ్యులను బెదిరించడమే కాకుండా కరెంట్, కేబుల్, మంచినీటికి సంబంధించిన కొళాయి పైపులను తొలగించి అసభ్యపదజాలంతో దూషించారని ఎంపీడీఓ సరళ శనివారం వేకువజామున నెల్లూరు రూరల్ పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసేందుకు వెళితే... దానిని స్వీకరించేందుకు కానిస్టేబుళ్లు సంశయించడంపై సామాజిక మీడియాలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. మండల అధికారిణి కే ఈ పరిస్థితే ఉంటే ఇతరుల పరిస్థితి ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఎంపీడీఓ సరళ శుక్రవారం రాత్రి 12 గంటల నుండి వేకువజామున నాలుగు గంటల వరకు తన ఫిర్యాదు తీసుకోవాలంటూ పోలీస్ స్టేషన్ నేలపై కూర్చొని నిరసన తెలిపిన విషయం విదితమే. నాలుగు గంటలుగా ఆమె అక్కడ దీక్ష చేస్తుంటే కూతవేటు దూరంలో ఉన్న ఎస్పీ సైతం స్పందించకపోవడం చూస్తుంటే అధికార పార్టీ వత్తిళ్లతోనే ఇలా జరిగిందన్న వ్యాఖ్యలూ వినిపిస్తున్నాయి. పోలీసులు ఫిర్యాదు తీసుకోవాలంటే దీక్ష చేయాలా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
పోలీసుల వ్యవహారంపై మీడియాలో వస్తున్న కథనాలకు స్పందించి ఎస్ఐ సాంబశివరావు తప్పని సరిపరిస్థితిలో ఎంపిడిఓ సరళ ఫిర్యాదును పోలీసు శాఖ స్వీకరించి, కోటం రెడ్డిని అరెస్టు చేసింది. ప్రజలకు సమస్యలుంటే ఎమ్మెల్యే వద్దకు వెళ్తారని, ఎమ్మెల్యేనే సమస్య అయితే ఎవరి వద్దకు వెళ్లాలని, ఓ అధికారి వ్యవహారంపై స్పందించేందుకు ఇన్నిగంటలా అని ఇప్పటికే విపక్ష నేత చంద్రబాబు మండిపడ్డారు. ఏది ఏమైనా అయితే ఎమ్మెల్యేపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనే దానిపై ఇంకా స్పష్టత లేదు.