శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడసేవ రోజు భక్తులకు మెరుగైన పారిశుద్ధ్య సేవలు అందిస్తామని టిటిడి హెల్త్ ఆఫీసర్ ఆర్.ఆర్. రెడ్డి తెలిపారు. తిరుమలలోని రాంభగీచా-2లో గల మీడియా సెంటర్లో గురువారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆర్. ఆర్. రెడ్డి మాట్లాడుతూ టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్, తిరుమల అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి ఆదేశాల మేరకు 4వ తేది శ్రీవారి గరుడ సేవ సందర్భంగా నాలుగు మాడ వీధులలో గ్యాలరీలలో వేచియుండే భక్తులకు 5 లక్షల వాటర్ బాటిళ్లను అందిస్తామన్నారు. గ్యాలరీలలోకి భక్తుల ప్రవేశం, నిష్క్రమణ ప్రాంతాలలో శ్రీవారి సేవకులతోపాటు స్థానిక యువత సహకారంతో వాటర్ బాటిళ్లను భక్తులకు సరఫరా చేస్తామన్నారు.
పర్యావరణం కలుషితంగా కాకుండా ఈసారి ఎకో ఫ్రెండ్లీ ప్రమోటర్స్ సరఫరా చేసిన ఉత్పత్తులతో పరిశుభ్రతా చర్యలు చేపట్టామన్నారు. ఇన్పెక్షన్ సొకకుండా, దుర్వాసన రాకుండా పారిశుద్ధ్య సిబ్బంది నిరంతరం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచనున్నారని తెలిపారు. తిరుమల నుంచి చెత్తాచెదారాన్ని ఎప్పటికప్పుడు తరలించేలా చర్యలు చేపట్టామన్నారు. సెంట్రల్ కమాండ్ కంట్రోల్ నుండి పారిశుద్ధ్యంకు సంబంధించి సలహాలు, ఫిర్యాదులు స్వీకరించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతామన్నారు. దాదాపు 2,800 మంది సిబ్బందితో పాటు మరో 500కు పైగా అదనపు సిబ్బంది, శ్రీవారి సేవకులు 1,050 మంది సేవలు అందిస్తున్నారని తెలిపారు. నాలుగు మాడ వీధులలో 42 టాయిలెట్ బ్లాక్స్ వినియోగంలో ఉన్నాయన్నారు.