ఆంధ్రప్రదేశ్ లో రెండ్రోజుల్లో లైసెన్స్ గడువు ముగుస్తుండటంతో యాజమానులు ఆఫర్లు ప్రకటిస్తున్నారు. ఈనెల 30తో గడువు అయిపోతున్నందున షాపుల్లోని మద్యం సీసాలను ఖాళీ చేసేందుకు ప్లాన్లు వేస్తున్నారు. లిక్కర్, బీరు బాటిళ్లను ఎమ్మార్పీ ధర కంటే తక్కువకే అమ్ముతున్నారు. అంతేకాదు మద్యం కొన్నవారికి స్నాక్స్ ఫ్రీ అంటూ బోర్డులు పెట్టారు. షాపుల్లో మిగిలిన మద్యాన్ని సర్కార్ కు అప్పగించి సొమ్ము చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ ఎక్కువమంది యజమానులు స్థానికంగానే మద్యం సరుకును అమ్మేందుకు ఇష్టపడుతున్నారు. మద్యం షాపుల వద్దనే సేవించే వారికి కోడిగుడ్లు, పప్పుగారెలు, మిర్చీలు, అరటి పళ్ల వంటి స్నాక్స్ ను అందజేస్తున్నారు.
కొంతమంది యజమానులు గత నెల నుంచే షాపుల్లో మద్యాన్ని తక్కువ స్టాక్ పెడుతున్నారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో అమ్మకాలు జరిగే షాపుల్లో భారీగానే స్టాక్ ఉంది. ఈ నేపథ్యంలో షాపులోని లిక్కర్ ను మొత్తం వదిలించుకునేందుకు యజమానులు ఎమ్మార్పీ ధర కంటే తక్కువకే మద్యం అమ్మకాలు చేపడుతూ, స్నాక్స్ ఫ్రీ గా ఇస్తుండటంతో కస్టమర్లు భారీగానే వచ్చి కొనుగోలు చేస్తున్నారు.
అక్టోబర్ 1 నుంచి కొత్త మద్యం విధానం అమల్లోకి వస్తున్నందున సిండికేట్ గా ఉన్న కొంతమంది వాటాలు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మరికొందరు స్నేహితులు, బంధువులకు పంపకాలు చేసుకుంటున్నారు. మద్యం పాలసీ మారి తక్కువ ధరకు దొరుకుతుండటంతో దసరా పండగకు ఇప్పటి నుంచే కొనుగోలు చేస్తున్నారు.