గోదావరి నదిలో పడవ బోల్తా పడిన ఘటనలో ఇవాళ మరో రెండు మృతదేహాలను వెలికితీశారు. సెప్టెంబర్ 15వ తేదీన జరిగిన ప్రమాదంలో గల్లంతు అయిన వారి కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ దళాలు ఇంకా గాలిస్తున్నాయి. బోటు ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య ప్రస్తుతం 36కు చేరుకున్నది. ఇంకా 11 మంది ఆచూకీ తెలియాల్సి ఉన్నది. కచులూరు వద్ద నీటిలో తేలుతున్న రెండు మృతదేహాలను తమ దళాలు వెలికితీసినట్లు ఎన్డీఆర్ఎఫ్ కమాండెంట్ జాహిద్ ఖాన్ తెలిపారు. ఒక మృతదేహాన్ని గుర్తించినట్లు దేవీపట్నం పోలీసులు వెల్లడించారు. కచులూరు, దేవీపట్నం, పోలవరం, గండి పోచమ్మ గుడి, దవళేశ్వరం బ్యారేజీ వద్ద గత ఈతగాళ్లు, రెస్క్యూ బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.