అనంతపురం: జనసేన ఆధ్వర్యంలో చేపట్టిన అనలిస్టు, స్పీకర్ ఇంటర్వ్యూలకు రెండో రోజు శనివారం కూడా భారీ స్థాయిలో స్పందన రావడం సంతోషంగా ఉందని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మహేందర్రెడ్డి పేర్కొన్నారు. పార్టీ ఆధ్వర్యంలో స్థానిక మూడో రోడ్డులోని గొంగడి రామప్ప ఫంక్షన్ హాల్లో శనివారం నిర్వహించిన ఈ ఇంటర్వ్యూలకు జిల్లా నలుమూలల నుంచి సుమారు 1500 మంది హాజరయ్యారు. జిల్లా పరిస్థితులు, వ్యవసాయం, రైతులు తదితర సమాచారాన్ని అభ్యర్థుల నుంచి రాష్ట్ర నాయకులు రాబట్టారు. ఒక్కొక్కరు వారికి తెలిసిన విధంగా సమాధానాలు ఇచ్చారు. ఈ సందర్భంగా మహేందర్రెడ్డి మాట్లాడుతూ రెండో రోజు సుమారు 1500 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూలను సద్వినియోగం చేసుకున్నారన్నారు. ఇంకా ఆసక్తి ఉన్న వారెవరైనా ఈ ఇంటర్వ్యూలకు హాజరై సద్వినియోగం చేసుకోవాలన్నారు. రెండు రోజులుగా అనంతపురం జనసేన కార్యకర్తలు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.
ఇంటర్వ్యూలకు హాజరైన అభ్యర్థులకు ఎటువంటి ఆటంకం కలగకుండా మౌలిక వసతులు కల్పించిన పవనిజం రాజు, కేఎం నాగేంద్రలను ఆయన అభినందించారు. ఆదివారం అనలిస్టులు, కంటెంట్ రైటర్లకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నామన్నారు. ఇంటర్వ్యూల్లో ప్రతిభ కనబరిచిన వారిని ఎంపిక చేయనున్నామన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు, యువత వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు రియాజ్, నరసింహ, రాష్ట్ర మీడియా ఇన్చార్జి హరిప్రసాద్, నగేష్, అనంతపురం జనసేన కార్యకర్తలు పవనిజం రాజు, కేఎం నాగేంద్ర, లక్ష్మీనారాయణ, గౌతమ్, సాగర్, విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.