జమ్మూకాశ్మీర్లో ఆర్టికల్ రద్దును వ్యతిరేకిస్తూ... సుప్రీంకోర్టులో చాలా కేసులు దాఖలయ్యాయి. వాటిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు... ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనానికి వాటిని బదిలీ చేసింది. అక్టోబర్ కల్లా వాటిని విచారించాలని స్పష్టం చేసింది. జమ్మూకాశ్మీర్లో పాలనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు పంపింది. ఏం చెయ్యాలో తమకు తెలుసన్న సుప్రీంకోర్టు... తాము ఆదేశాలు జారీ చేశామనీ, వాటిని మార్చ దలచుకోలేదని స్పష్టం చేసింది. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి... జమ్మూకాశ్మీర్లో పర్యటించేందుకు అనుమతించిన సుప్రీంకోర్టు... అక్కడి మాజీ ఎమ్మెల్యే మొహమ్మద్ యూసఫ్ తరిగామీని కలవవచ్చని తెలిపింది. ఐతే... ఈ పర్యటనను రాజకీయ లబ్ది కోసం వాడుకోరాదని ఆదేశించింది. ఒకవేళ ఏచూరీ రాజకీయ చర్యలకు పాల్పడితే... వాటిపై తమకు స్వచ్ఛగా కంప్లైంట్ ఇవ్వవచ్చని జమ్మూకాశ్మీర్ అధికారులకు తెలిపింది.
ఆర్టికల్ 370 రద్దు అంశంలో కేంద్రం నిర్ణయానికి అనుకూలంగా, వ్యతిరేకంగా... రెండువైపులా వాదనలు నడిచాయి. కేంద్రం అడ్డమైన ఆంక్షలు విధించి... జమ్మూకాశ్మీర్ ప్రజలకు ఎమర్జెన్సీ తరహా పరిస్థితులు కల్పిస్తోందని కొన్ని పిటిషన్లు వచ్చాయి. రాజ్యాంగ బద్ధంగా జమ్మూకాశ్మీర్కి ఉన్న సార్వభౌమత్వ హక్కుల్ని కేంద్రం కాలరాసిందని కొందరు తమ పిటిషన్లలో తెలిపారు. అలాగే... ఆరుగురు రిటైర్డ్ మిలిటరీ అధికారులు, ప్రభుత్వాధికారులు సైతం... కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ... పిటిషన్ వేశారు. వీటన్నింటినీ ఐదుగురు జడ్జిల ధర్మాసనం పరిశీలించనుంది. ఐతే... సుప్రీంకోర్టు ఏం చెబితే... అదే విషయాన్ని ఐక్యరాజ్యసమితికి చెబుతామన్నారు అటార్నీ జనరల్.
ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం... జమ్మూకాశ్మీర్, లఢక్ కేంద్ర పాలిత ప్రాంతాల అభివృద్ధి కోసం భారీ ప్యాకేజీ ప్రకటించబోతున్నట్లు తెలిసింది. 50 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కేంద్రం ప్రణాళికలు ఉండబోతున్నాయని సమాచారం.