బిజెపి నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ ఈరోజు మధ్యాహ్నం 12.07 గంటలకు ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఆసుపత్రి వద్దకు బీజేపీ అగ్రనేతలంతా చేరుకుంటున్నారు. కాసేపట్లో జైట్లీ పార్థివదేహాన్ని కైలాశ్ కాలనీలో ఉన్న ఆయన నివాసానికి తరలించనున్నారు. ప్రజలు, అభిమానుల దర్శనార్థం ఆయన నివాసం వద్ద భౌతికకాయాన్ని ఉంచనున్నారు. రేపు ఉదయం బీజేపీ ప్రధాన కార్యాలయానికి పార్థివదేహాన్ని తీసుకెళ్తారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు ఆయనకు ఘన నివాళి అర్పించనున్నాయి. అనంతరం అక్కడి నుంచి నిగమ్ బోధ్ ఘాట్ కు తీసుకెళ్తారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో అంత్యక్రియలను నిర్వహించనున్నారు. మరోవైపు, జైట్లీ మరణం నేపథ్యంలో బీహార్ లోని నితీశ్ కుమార్ ప్రభుత్వం రెండు రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది.