శాంతి భద్రతలకు విఘాతం కలిగించొద్దని ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం కోరినా.. రాహుల్ గాంధీతో కూడిన విపక్ష బృందం దిల్లీ నుంచి శ్రీనగర్కు బయలుదేరింది. ఈ సందర్భంగా గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ.. ప్రభుత్వం చేసే ప్రకటనలు ఒకదానికొకటి విరుద్ధంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. ‘‘ఓవైపు కశ్మీర్లో పరిస్థితులు సాధారణంగానే ఉన్నాయని ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు అక్కడ పర్యటించడానికి ఎవర్నీ అనుమతించడం లేదు. ఇంతటి విరుద్ధ ప్రకటనలు ఎప్పుడూ చూడలేదు. ఒకవేళ పరిస్థితులన్నీ సాధారణంగానే ఉంటే రాజకీయ నాయకుల్ని ఇంకా గృహ నిర్బంధంలో ఎందుకు ఉంచారు?’’ అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అలాగే బృందంలో సభ్యుడైన ఎన్సీపీ నేత మజీద్ మెమన్ మాట్లాడుతూ.. ‘విపక్షాల పర్యటనతో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది అన్న ప్రభుత్వ వాదన నిరాధారం’ అని వ్యాఖ్యానించారు.