ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీరు బాటిల్‌తో ఆలయంలోకి..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 20, 2017, 05:22 PM

బీరు బాటిల్‌తో విరూపాక్ష ఆలయంలోకి ప్రవేశించి.. ఓ విదేశీ టూరిస్ట్ గందరగోళం సృష్టించాడు. అతడి చేతిలో బీరు బాటిల్‌ను గమనించిన కొంత మంది భక్తులు.. అది నిషేధిత ప్రాంతమని నచ్చజెప్పి బయటికి పంపించినా.. అధికారుల కళ్లుగప్పి మళ్లీ వచ్చాడు. ఈ ఘటన కర్ణాటకలోని హంపీలో చోటు చేసుకుంది. ఆల్కహాల్ బాటిల్‌తో అతడు ఆలయంలోకి ప్రవేశిస్తున్నా.. టెంపుల్ అధికారులు ఏవిధంగా అడ్డుకోలేకపోయారని అందరూ ప్రశ్నిస్తున్నారు.


విజయనగర పాలకుల రాజధాని నగరంగా విలసిల్లిన హంపి నగరానిక ప్రత్యేక విశిష్టత ఉంది. ఆ వంశానికి చెందిన రాజులు ఇక్కడ అనేక ఆలయాలను నిర్మించారు. అనేక ప్రత్యేకతలున్న ఈ ప్రాంతం.. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్‌లోనూ చోటు దక్కించుకుంది. దీంతో.. జాతీయంగానే కాకుండా అంతర్జాతీయంగానూ ఏటా ఇక్కడికి అనేక మంది యాత్రికులు వస్తుంటారు.కొంత మంది విదేశీ యాత్రికులు హంపీలోని ఆర్కిటెక్చర్‌పై పరిశోధనలు కూడా చేస్తున్నారు. విదేశీ యాత్రికుల తాకిడి ఎక్కువగా ఉన్న ఇక్కడి విరూపాక్ష ఆలయ సందర్శనకు ఇటీవల.. హాలెండ్‌కు చెందిన ఒక జంట వచ్చింది. ఆ జంటలో.. పురుషుడు బీరు తాగుతూనే లోపలికి ప్రవేశించాడు. అతడి చేతిలో బీరు సీసాను గమనించిన కొంత మంది.. అది తప్పని, దేవాలయాల్లో అలా చేయకూడదని నచ్చజెప్పి బయటికి పంపించారు.


బయటకి వెళ్లినట్లే వెళ్లిన జంట కాసేపటికి మళ్లీ ప్రత్యక్షమైంది. లోపలికి వచ్చిన తర్వాత అతగాడు మళ్లీ బీరు తాగుతూ తిరగడం మొదలెట్టాడు. ఈ పర్యాయం బీరు సీసాను లోపలికి తీసుకురావడానికి అతడి భార్య సహకరించింది. ఆమె తన దుస్తుల మాటున పెట్టుకొని వచ్చి, అతడికి బీరు సీసాను అందించింది.విదేశీ యాత్రికుడి చేతిలో మళ్లీ బీరు సీసాను గమనించిన కొంత మందికి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఈసారి వారితో వాగ్విదానికి దిగారు. అలా జరగకుండా చూడటంలో విఫలమైన సెక్యూరిటీ వాళ్లను కూడా ఏకి పారేశారు. దీంతో ఆలయ సిబ్బంది వచ్చి ఆ విదేశీ జంటను బయటికి పంపించేశారు.


ఈ ఘటన తర్వాత మీడియా.. వాళ్లను పట్టుకునే ప్రయత్నం చేసింది. ఆలయ సిబ్బంది వాళ్లకు సంబంధించిన ఎలాంటి వివరాలు సేకరించకపోవడంతో.. ఆ విదేశీయుల పేర్లు, చిరునామా తెలియలేదు. అతడు ఆలయంలో బీరు సీసాతో తిరుగుతున్న ఫోటోను ఒక వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. ఇప్పుడది వైరల్‌గా మారింది






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com